IND vs SA: తొలి టీ20 టీమిండియాదే.. మాములు విజయం కాదు!
సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. మంగళవారం కటక్ వేదికగా జరిగిన తొలి టీ20లో సమష్టిగా రాణించిన భారత్ 101 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఊచకోతతో పోరాడే లక్ష్యాన్ని అందుకున్న భారత్.. ఆ తర్వాత బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో పూర్తిగా టీమిండియానే ఆధిపత్యం చెలాయించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 59 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి(3/31) మూడు వికెట్లు తీయగా.. లుతో సిపమ్లా(2/38) రెండు వికెట్లు పడగొట్టాడు. డోనోవన్ ఫెర్రెరియా ఒక వికెట్ తీసాడు.
అనంతరం సౌతాఫ్రికా 12.3 ఓవర్లలో 74 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. డెవాల్డ్ బ్రెవిస్(14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 22) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగతా బ్యాటర్లు తీవ్రంగా నిరాశపర్చారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(2/14), జస్ప్రీత్ బుమ్రా(2/17), వరుణ్ చక్రవర్తీ(2/19), అక్షర్ పటేల్(2/7) రెండేసి వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే చెరో వికెట్ తీసారు.

సున్నాకే వికెట్..
లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఒక్క పరుగు కూడా చేయకుండానే ఓపెనర్ క్వింటన్ డికాక్(0) డకౌట్గా వెనుదిరిగాడు. అర్ష్దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్ రెంబో బంతికే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. తన మరుసటి ఓవర్లో ట్రిస్టన్ స్టబ్స్(14)ను అర్ష్దీప్ సింగ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి డెవాల్డ్ బ్రెవిస్ రాగా.. కెప్టెన్ మార్క్రమ్ ఆచితూచి ఆడాడు. కానీ అక్షర్ పటేల్ తన తొలి బంతికే మార్క్రమ్(14)ను క్లీన్ బౌల్డ్ చేసి సౌతాఫ్రికాను కోలుకోలేని దెబ్బతీసాడు. దాంతో పవర్ ప్లేలో సౌతాఫ్రికా 3 వికెట్లకు 45 పరుగులే చేసింది. ఆ వెంటనే డేవిడ్ మిల్లర్(1)ను హార్దిక్ పాండ్యా కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు.
వరుసగా వికెట్లు..
ఆ తర్వాత వచ్చిన డోనోవన్ ఫెర్రెరియా(5)ను వరుణ్ చక్రవర్తీ ఔట్ చేయగా.. వేగంగా ఆడిన డెవాల్డ్ బ్రెవిస్(22)ను జస్ప్రీత్ బుమ్రా క్యాచ్ ఔట్ చేశాడు. ఈ వికెట్తో టీ20ల్లో బుమ్రా 100 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. భారీ సిక్సర్ బాదిన మార్కో జాన్సెన్(12)ను మరుసటి బంతికే వరుణ్ చక్రవర్తీ క్లీన్ బౌల్డ్ చేశాడు. అదే ఓవర్లో కేశవ్ మహరాజ్(0)ను బుమ్రా క్యాచ్ ఔట్ చేయగా.. అన్రిచ్ నోర్జ్(1)ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. లుతో సిప్లమా(2)ను దూబే ఆఖరి వికెట్గా పెవిలియన్ చేర్చడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే సౌతాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోర్. ఇరు జట్ల మధ్య రెండో టీ20 గురువారం న్యూ చంఢీఘడ్ వేదికగా జరగనుంది.












Click it and Unblock the Notifications