సంజు శాంసన్పై వేటు: వైభవ్ సూర్యవంశీకి బిగ్ ఛాన్స్- రింకూ సింగ్ రీఎంట్రీ: భారీ మార్పులు
జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత టీ20 క్రికెట్ జట్టును బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. ఈ నెల 23న ప్రారంభం కానున్న ఈ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఇది. ఇందులో ఆడే జట్టుకు స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనున్నాడు. టీ20 వరల్డ్ కప్ హీరో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్కు ఈ జట్టులో చోటు దక్కలేదు. అదే సమయంలో స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ తిరిగి ఈ జట్టులోకి పునరాగమనం చేశాడు. లెఫ్ట్ హ్యాండర్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన స్థానాన్ని నిలుపుకొన్నాడు. జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఇటీవలి కాలంలో పేలవమైన ఫామ్తో ఇబ్బంది పడుతున్న సంజు శాంసన్పై సెలక్టర్లు వేటు వేశారు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో ఆడిన మూడు టీ20 మ్యాచ్ల్లో శాంసన్ ఆరు పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వైపు మొగ్గు చూపిన సెలెక్టర్లు.. శాంసన్ను పక్కన పెట్టారు. అతని స్థానంలో పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రభ్సిమ్రాన్ సింగ్ను బ్యాకప్ వికెట్ కీపర్ బ్యాటర్గా జట్టులోకి తీసుకున్నారు.

మరోవైపు.. టీ20 ప్రపంచకప్ తర్వాత జట్టుకు దూరమైన రింకూ సింగ్ మళ్లీ పునరాగమనం చేయడం జట్టుకు కలిసొచ్చే అంశం. ఐపీఎల్ సీజన్ చివరలో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున రింకూ మంచి ఫామ్ కనబరిచాడు. అలాగే, గాయం కారణంగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ పర్యటనకు కూడా దూరం అయ్యాడు. అతన్ని కూడా జట్టులోకి తీసుకోలేదు. ప్రస్తుతం అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ లో ఉంటోన్నాడు.
మరో యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా గాయం కారణంగానే ఈ సిరీస్కు అందుబాటులో లేకుండాపోయాడు. బౌలింగ్ విభాగంలో సెలక్టర్లు యువ రక్తాన్ని ప్రోత్సహించారు. సీనియర్ పేసర్ అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాలకు ఈ పర్యటన నుంచి విశ్రాంతి కల్పించారు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున రాణించిన రాజస్థాన్ యువ స్పీడ్స్టర్ అశోక్ శర్మకు తొలిసారి జాతీయ జట్టులో అవకాశం లభించింది.
గంటకు 150 కిలోమీటర్ల పైగా వేగంతో బౌలింగ్ చేయగల అశోక్ శర్మతో పాటు మయాంక్ యాదవ్, యష్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ను నడిపించనున్నారు. స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, హర్ష్ దూబేకు చోటు దక్కింది.
ఈ మూడు మ్యాచ్లు కూడా హరారే వేదికగా జరగనున్నాయి. ఈ నెల 23న మొదటి టీ20 మ్యాచ్ జరగనుండగా, 25, 26 తేదీల్లో మిగిలిన రెండూ ఆడతారు. ఇంగ్లాండ్తో జరిగే టీ20 సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు హరారేకు చేరుకుంటుంది. సీనియర్ల గైర్హాజరీలో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఈ కొత్త లుక్ టీమిండియా జింబాబ్వే గడ్డపై ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.
భారత టీ20 జట్టు వివరాలు
| విభాగం | ఆటగాళ్లు |
|---|---|
| బ్యాటర్లు/ఆల్రౌండర్లు | శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, రింకూ సింగ్, శివమ్ దూబే, సూర్యాంశ్ శెడ్గే |
| వికెట్ కీపర్లు | ఇషాన్ కిషన్, ప్రభ్సిమ్రాన్ సింగ్ |
| బౌలర్లు | వరుణ్ చక్రవర్తి, హర్ష్ దూబే, మయాంక్ యాదవ్, యష్ ఠాకూర్, అశోక్ శర్మ, ప్రిన్స్ యాదవ్ |












Click it and Unblock the Notifications