IPL 2024: ఆ రెండు మ్యాచ్ లు రీషెడ్యూల్ చేసిన బీసీసీఐ-కారణమిదే..!
ఈ ఏడాది ఐపీఎల్ 2024 జోరుగా సాగిపోతోంది. తొలుత ఈ టోర్నీలో తొలి దశ మాత్రమే భారత్ లో ఉంటుందని, రెండో దశ విదేశాల్లో ఉంటుందని భావించినా బీసీసీఐ పక్కా ప్రణాళికలతో మొత్తం టోర్నీ స్వదేశంలోనే జరుగుతోంది. ఈ దశలో బీసీసీఐ ఇవాళ టోర్నీలో రెండు మ్యాచ్ లను రీషెడ్యూల్ చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక గల కారణాలను కూడా బీసీసీఐ వెల్లడించలేదు. అయితే స్ధానిక పరిస్ధితులే దీనికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
గతంలో బీసీసీఐ ప్రకటించిన ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం కోల్కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఏప్రిల్ 17న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరగాల్సి ఉంది. అలాగే ఏప్రిల్ 16న గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్ లను రీషెడ్యూల్ చేస్తున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.

బీసీసీఐ ప్రకటన ప్రకారం ఏప్రిల్ 16న అహ్మదాబాద్ లో జరగాల్సిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ను ఒక్క రోజు వాయిదా వేసింది. అంటే ఏప్రిల్ 17న ఇది జరుగుతుంది. అలాగే ఏప్రిల్ 17న జరగాల్సిన కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ ఒక రోజు ముందుకు జరిగింది. అంటే ఏప్రిల్ 16న ఈ మ్యాచ్ ఉంటుంది. శ్రీరామనవమి తో పాటు ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణకు స్ధానికంగా ఎదురైన ఇబ్బందుల వల్లే ఈ మ్యాచ్ లను రీషెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications