రోహిత్ శర్మను నెత్తిన పెట్టుకుంటాం- రిలీజ్ చేయండి: ముంబై ఇండియన్స్కు భారీ ఆఫర్
Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ సమీపించింది. ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఇంకో రెండు నెలల్లో ఐపీఎల్ 2024 (IPL 2024) ఆరంభం కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నెలల్లో ఐపీఎల్ 2024 సీజన్లో మొత్తం 10 జట్లు పోరాడనున్నాయి.
ఈ పరిస్థితుల్లో.. ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం ప్రకంపనలను సృష్టించింది. కేప్టెన్గా రోహిత్ శర్మపై వేటు వేసింది. అతన్ని తొలగించింది. రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలను అప్పగించింది. ముంబై ఇండియన్స్ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారి తీసింది. ఆ ఫ్రాంఛైజీపై నిప్పులు చెరుగుతున్నారు.

ఈ విమర్శలపై ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. సారధి మార్పునకు గల కారణాలపై వివరణ ఇవ్వలేదు. కేప్టెన్సీ మార్పుపై రోహిత్ శర్మకు ముందుగానే ముంబై ఇండియన్స్ సమాచారం ఇచ్చిందని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది.
వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ సీజన్ నాటికి కేప్టెన్గా తప్పుకోవాల్సి ఉంటుందంటూ ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఆరంభానికి ముందే అంటే అక్టోబర్ మొదటి వారంలోనే ముంబై ఇండియన్స్ యాజమాన్యం రోహిత్ శర్మకు సమాచారం ఇచ్చిందని తెలిపింది. హార్దిక్ పాండ్యా కేప్టెన్సీలో ఆడటానికి అంగీకారం తెలిపాడని కూడా పేర్కొంది.
తాజాగా ఢిల్లీ కేపిటల్స్ (Delhi Capitals).. సంచలన ప్రకటన చేసింది. రోహిత్ శర్మను తాము జట్టులోకి తీసుకుంటామని, కేప్టెన్గా నియమించుకుంటామని వెల్లడించింది. రిలీజ్ చేసిన వెంటనే రోహిత్కు తాము జట్టు సారధిగా ప్రకటిస్తామని పేర్కొంది. అపారమైన అనుభవం ఉన్న అతనికి జట్టులో సముచిత స్థానాన్ని కల్పిస్తామని తెలిపింది.
దీనిపై స్పోర్ట్స్ టుడే ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. రోహిత్ శర్మను విడుదల చేయాలంటూ ముంబై ఇండియన్స్కు ప్రతిపాదనలను పంపించింది ఢిల్లీ కేపిటల్స్. దీనికి ప్రత్యామ్నాయంగా భారీ ఆఫర్ను పెట్టింది. రోహిత్ శర్మకు కేటాయించిన ఫీజు మొత్తం కంటే కూడా అయిదు శాతం అదనంగా చెల్లిస్తామంటూ ప్రపోజల్స్ పెట్టినట్లు తెలుస్తోంది.
దీనికి ముంబై ఇండియన్స్ అంగీకరించలేదని స్పోర్ట్స్ టుడే కథనం. కాంట్రాక్ట్ గడువు ఇంకా ముగియకపోవడం వల్ల రోహిత్ శర్మను విడుదల చేయలేమని తెలిపింది. ప్లేయర్స్ స్వాపింగ్కు కూడా ముంబై ఇండియన్స్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. రోహిత్ తమతోనే ఉంటాడని, సుదీర్ఘకాలం పాటు జట్టులో కొనసాగుతాడని స్పష్టం చేసినట్లు సమాచారం.
ఢిల్లీ కేపిటల్స్.. ఈ ఆఫర్ పెట్టడానికి కారణాలు లేకపోలేదు. ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ గెలవని జట్టు ఇది. ప్రతీసారీ విఫలమౌతూనే వస్తోంది. ఈ ఏడాది కూడా ఏ మాత్రం అంచనాలకు తగ్గట్టుగా రాణించలేదా జట్టు. 14 మ్యాచ్లల్లో అయిదింట్లో మాత్రమే గెలిచింది. తొమ్మిదింట్లో పరాజయం పాలైంది. 10 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
రోహిత్ శర్మను గనక జట్టులోకి తీసుకుని.. అతనికి కేప్టెన్సీని అప్పగిస్తే- పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని ఆశిస్తోంది ఢిల్లీ కేపిటల్స్. తన టాలెంట్తో ముంబై ఇండియన్స్ను ది బెస్ట్గా మలిచాడు రోహిత్. ఒకటి కాదు రెండూ కాదు.. ఏకంగా అయిదుసార్లు ట్రోఫీని అందించగలిగాడు. అలాంటి తమకూ లభిస్తాయని అంచనా వేస్తోంది డీసీ.












Click it and Unblock the Notifications