భారత్ గెలవడంపై పాకిస్థాన్ ప్రజల షాకింగ్ కామెంట్స్..
దుబాయ్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో దాయాది జట్టుపై ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ(100*) సూపర్ సెంచరీతో చెలరేగాడు. ఇక శ్రేయస్(56) అర్దశతకంతో అదరగొట్టారు. దీంతో పాక్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 42.3 ఓవర్లలోనే ఛేదించింది. రోహిత్(20), గిల్(46), హార్దిక్(8), అక్షర్(3*) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో అఫ్రిది 2 వికెట్లు, అహ్మద్, ఖుష్దిల్ చెరో వికెట్ తీశారు.
2017 ఛాంపియన్ ట్రోఫీలో పాకిస్థాన్ చేతిలో టీమ్ ఇండియా ఓటమిని చవి చూసింది. దీంతో తాజాగా భారత్ గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. టీమిండియా చేతిలో ఓడిపోవడంతో పాకిస్థాన్ ఛాంపియన్ ట్రోఫీ నుంచి దాదాపు అవుట్ అయినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా పాకిస్థాన్ ఓడిపోయింది. దీంతో గ్రూప్ దశలోనే పాకిస్థాన్ జట్టు టోర్ని నుంచి నిష్క్రమించింది.

అయితే పాకిస్థాన్ ఓటమిపై ఆ దేశ క్రికెట్ అభిమానులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. పాకిస్థాన్ జట్టుపై చాలా ఆశలు పెట్టుకున్నామని.. అయితే పేలవ ప్రదర్శనతో టీమ్ ఓటమి పాలైందని మండిపడుతున్నారు. "మేము జట్టుపై చాలా అంచనాలు పెట్టుకున్నాం. 315 వరకు స్కోర్ రాబట్టగలదని భావించాం. కానీ అది జరగలేదు. 250 పరుగులు కూడా చేయలేదు. బ్యాటింగ్ చేయకపోయినా.. బౌలింగ్ సరిగా చేసినా బాగుండేది. కోహ్లీని కట్టడి చేయాల్సింది. నేను పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు విన్నవిస్తున్నా.. కొత్తవారికి అవకాశం ఇవ్వండి." అని ఓ అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు.
మరో అభిమాని.. పాకిస్థాన్ జట్టు ఫీల్డింగ్ సరిగా చేయలేదు. జట్టుకు సరైన శిక్షణ అవసరం. పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ సెంటిమెంట్ కు సంబంధించింది. జాగ్రత్తగా ఆడాల్సింది.. అని అన్నాడు. ఇక 49.5 ఓవర్లలో పాక్ జట్టు 241 పరుగులకే ఆలౌట్ అయింది. షకీల్ (62), రిజ్వాన్ (46), కుష్దిల్ (38) పరుగులతో రాణించారు.












Click it and Unblock the Notifications