బీసీసీఐ రివార్డులో 2.5 కోట్లు తగ్గించుకున్న రాహుల్ ద్రావిడ్ ! కారణం ఇదేనట..
అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిధ్యమిచ్చిన టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా టైటిల్ విజయం తర్వాత బీసీసీఐ మొత్తం జట్టుకు కలిపి రూ.125 కోట్ల రివార్డు ప్రకటించింది. దీన్ని జట్టులో ఆటగాళ్లు, కోచ్, ఇతర సిబ్బంది ఎంతెత తీసుకోవాలో కూడా బీసీసీఐ నిర్ణయించింది. దీని ప్రకారం జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ కు ఆటగాళ్లతో సమానంగా రూ.5 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఇంత మొత్తం తీసుకునేందుకు రాహుల్ నిరాకరించారు.
టీ 20 వరల్డ్ కప్ టైటిల్ కు గిఫ్ట్ గా ఆటగాళ్లకు రూ.5 కోట్ల చొప్పున ఇస్తున్న బీసీసీఐ.. కోచ్ రాహుల్ ద్రావిడ్ కు కూడా అంతే మొత్తం ఇవ్వాలని భావించింది. కానీ మిగతా సపోర్టింగ్ స్టాఫ్ కు మాత్రం రూ.2.5 కోట్ల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో రాహుల్ ఏమనుకున్నాడో ఏమో కానీ తనకు కూడా కేవలం రూ.2.5 కోట్లు మాత్రమే ఇవ్వాలని బీసీసీఐకి సూచించినట్లు తెలుస్తోంది. దీంతో బీసీసీఐ కూడా ఆశ్చర్చపోయింది. ఈ రోజుల్లో డబ్బెవరికి చేదు. దీంతో రాహుల్ విజ్ఞప్తిని మన్నిస్తున్నట్లు సమాచారం.

రాహుల్ వినతిని బీసీసీఐ అంగీకరించాక అతనితో పాటు సపోర్టింగ్ స్టాఫ్ గా ఉన్న బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ తో సమానంగా రూ.2.5 కోట్ల చొప్పున ఇవ్వబోతున్నారు. భారత క్రికెట్ లో ఆ మాట కొస్తే ప్రపంచ క్రికెట్లో జెంటిల్ మెన్ గా రాహుల్ కు పేరుంది. క్రికెట్ ఆడుతున్న సమయంలో కానీ, జట్టు కోచ్ గా వ్యవహరిస్తున్న సమయంలో కానీ బీసీసీఐ ముందు ఆయన ఎప్పుడూ ఎలాంటి డిమాండ్లు పెట్టలేదు. అంతే కాదు భారత క్రికెట్ కు రాహుల్ అందించిన సేవలు అసమానమైనవి. ఇప్పుడు తాజా నిర్ణయంతో రాహుల్ మరో ఎత్తుకు ఎదిగాడు.












Click it and Unblock the Notifications