మూడో పెళ్లిపై షోయబ్ మాలిక్ క్లారిటీ!
పాకిస్థాన్ స్టార్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ తన వ్యక్తిగత జీవితంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై ఎట్టకేలకు స్పందించాడు. ఆయన మూడో వివాహం చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తూ ఓ అధికారిక ప్రకటన విడుదల చేశాడు. ఇవన్నీ కేవలం వ్యూస్ కోస సృష్టించిన కల్పిత గాథలను, తన మౌనాన్ని అలుసుగా తీసుకుని కొందరు హద్దులు మీరుతున్నారని ఆయన మండిపడ్డాడు.
కుమారుడి భవిష్యత్తుపై ఆందోళన
ఈ వివాదంపై స్పందిస్తూ షోయబ్ మాలిక్ తన కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. "నా కుమారుడు ఇప్పుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. వాడు వార్తలు చదవగలిగే వయసులో ఉన్నాడు. ఇలాంటి తప్పుడు కథనాలను వాడు చదివితే ఎంతటి మానసిక వేదనకు గురవుతాడో ఎవరైనా ఆలోచించారా?" అని షోయబ్ మాలిక్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఆర్థిక లాభం కోసం కుటుంబ గౌరవాలను తాకట్టు పెట్టవద్దని సోషల్ మీడియా వేదికలను హెచ్చరించాడు.

సనా జావేద్పై వస్తున్న ట్రోల్స్కు చెక్
తన ప్రస్తుత భార్య, పాకిస్థానీ నటి సనా జావేద్ను లక్ష్యంగా చేసుకుని వస్తున్న విమర్శలను కూడా షోయబ్ తీవ్రంగా తప్పుబట్టాడు. 2023లో సానియా మీర్జాతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్న తర్వాతే తాను చట్టబద్ధంగా పునర్వివాహం చేసుకున్నానని ఆయన స్పష్టం చేశాడు. విడాకుల అనంతరం తమ కుమారుడి బాధ్యతలను ఇద్దరం పంచుకుంటున్నామని, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిర్ణయాలను గౌరవించాలని ఆయన కోరాడు.
చట్టపరమైన చర్యల హెచ్చరిక
ఇకనైనా తనపై, తన కుటుంబంపై అవాస్తవాలను ప్రచారం చేయడం ఆపకపోతే కఠిన చర్యలు తప్పవని షోయబ్ మాలిక్ హెచ్చరించాడు. కేవలం లైకులు, షేర్ల కోసం ఇతరుల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికాడు. తన న్యాయ బృందం ఇప్పటికే సోషల్ మీడియాలోని ప్రచారాలను గమనిస్తోందని, నిబంధనలు అతిక్రమించే వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశాడు.












Click it and Unblock the Notifications