టీమిండియాపై సెంచరీ బాదిన శ్రీలంక బ్యాటర్- ఫాలో ఆన్ ఆడుతూ చుక్కలు చూపించాడు
కొలంబో సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక యువ బ్యాటర్ సోనాల్ దినుషా అద్భుత ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియా పటిష్ట బౌలింగ్ను అత్యంత దీటుగా ఎదుర్కొంటూ, ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు బాది రికార్డు సృష్టించాడు. ఈ అసాధారణ పోరాటంతో శ్రీలంక జట్టును ఇన్నింగ్స్ ఓటమి ముంగిట నుంచి తప్పించడమే కాకుండా, జట్టును భారీ ఆధిక్యంలో నిలిపాడు.
మూడో ఇన్నింగ్స్లో ఫాలోఆన్ ఆడుతున్న క్లిష్ట సమయంలో దినుషా చూపిన తెగువ శ్రీలంక శిబిరంలో కొత్త ఆశలను రేకెత్తించింది. మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. భారత జట్టు మొదటి ఇన్నింగ్స్లో 213 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన తర్వాత లంకకు ఫాలోఆన్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్లోనూ శ్రీలంక జట్టు త్వరగానే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పసిందు సూర్యబండార, కమిందు మెండిస్ జోడీ జట్టును కొంతవరకు ఆదుకుని స్కోరును 170 దాటించారు.

నాలుగో రోజు చివరి సెషన్లో భారత్ వరుస వికెట్లు తీయడంతో శ్రీలంక 218 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. ఈ దశలో అయిదో రోజు ఆట ప్రారంభించిన దినుషా.. కేశర నువంతతో కలిసి లంక ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా సోనాల్ దినుషా క్రికెట్ చరిత్రలో పలు చారిత్రాత్మక మైలురాళ్లను అందుకున్నాడు. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఆడిన నాలుగు ఇన్నింగ్స్ల్లోనూ 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన మూడో శ్రీలంక బ్యాటర్గా నిలిచాడు.
గతంలో లంక దిగ్గజాలు కుమార సంగక్కర, దిముత్ కరుణరత్నే మాత్రమే ఈ అరుదైన ఘనత సాధించారు. భారత్పై ఈ రికార్డు సృష్టించిన రెండో బ్యాటర్ కూడా అతనే. గతంలో 2000లో జింబాబ్వే మాజీ ఆటగాడు ఆండీ ఫ్లవర్ మాత్రమే భారత్పై ఈ అద్భుత రికార్డు సాధించాడు. అయిదో రోజు లంచ్ సమయానికి భారత్ కొత్త బంతితో దాడి చేసినప్పటికీ వికెట్ కోల్పోకుండా ఈ జోడీ క్రీజులో అద్భుతంగా నిలిచింది.
లంచ్ ముగిసిన వెంటనే భారత స్పిన్నర్ మానవ్ సుతార్ ఈ ప్రమాదకర భాగస్వామ్యానికి తెర దించాడు. 46 పరుగులు చేసిన నువంతను అవుట్ చేశాడు. ఆ వెంటనే సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్లో ప్రభాత్ జయసూర్య కూడా అవుట్ కావడంతో శ్రీలంక 355 పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయింది. అయినప్పటికీ అప్పటికే లంక జట్టు భారత్పై గౌరవప్రదమైన ఆధిక్యాన్ని సాధించడంలో సఫలమైంది.
భారత్తో జరిగిన ఈ టెస్టు సిరీస్లో దినుషా నిలకడను కనబరిచాడు. ఈ సిరీస్లో అతనికి మూడో శతకం ఇది. ఆరు ఫోర్లతో 108 పరుగలతో క్రీజ్ లో నిలిచాడు. మొదటి ఇన్నింగ్స్లో 103 పరుగులతో రాణించిన అతను రెండో ఇన్నింగ్స్లోనూ లంక తరఫున గోడలా నిలబడ్డాడు. భారత మేటి స్పిన్నర్లు జడేజా, మానవ్ సుతార్ వంటి అనుభవజ్ఞులను ఎదుర్కొని ఈ స్థాయి పరుగులు చేయడం అతడి ప్రతిభకు నిదర్శనం.














Click it and Unblock the Notifications