తెలంగాణ డీజీపీ విధ్వంసం.. 21 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ బాదిన సీవీ ఆనంద్!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన సీ డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్ షిప్లో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ విధ్వంసకర సెంచరీతో మెరిశారు. తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ఆడిన తొలి మ్యాచ్లోనే బ్యాట్తో విరుచుకుపడ్డారు. సికింద్రాబాద్ క్లబ్ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగిన సీవీ ఆనంద్.. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ జట్టుపై ఖాకీ యూనిఫాం నుంచి వైట్ జెర్సీలోకి మారి అద్భుతమైన సెంచరీతో అలరించారు.
సికింద్రాబాద్ క్లబ్ విజయంలో సీవీ ఆనంద్ కీలక పాత్ర పోషించారు. కేవలం 82 బంతుల్లోనే 21 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో నాటౌట్గా 126 పరుగులు సాధించి బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆ తర్వాత బౌలింగ్లోనూ 5 ఓవర్లు వేసి కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చారు. ఆయనకు జంషీద్ హోర్ముస్టీ(77), సంజీవ్ రెడ్డి(40) మంచి సహకారం అందించడంతో సికింద్రాబాద్ క్లబ్ నిర్ణీత 39 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ 21.1 ఓవర్లలో 3 వికెట్లకు 72 పరుగులు చేసిన సమయంలో వర్షం పడటంతో వీజేడీ పద్ధతి ప్రకారం సికింద్రాబాద్ క్లబ్ను విజేతగా ప్రకటించారు.

లీగ్ లోని ఇతర మ్యాచ్లలోనూ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. కాకతీయ జట్టుకు చెందిన అజయ్ కుమార్ సంగెం ఆల్సెంట్స్ జట్టుపై 68 బంతుల్లోనే 11 ఫోర్లు, 12 సిక్సర్లతో 142 పరుగులు చేసి రాణించడంతో కాకతీయ జట్టు 50 ఓవర్లలో 440/9 భారీ స్కోరు చేసింది. అయితే ఆల్సెంట్స్ 5 ఓవర్లలో 24/0 ఉన్నప్పుడు వర్షం కారణంగా మ్యాచ్ను రద్దు చేశారు. మరో మ్యాచ్ లో సెయింట్ ప్యాట్రిక్స్ బౌలర్ స్మరణ్ పాల్ 5 వికెట్లు తీసినప్పటికీ.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(రామంతాపూర్) జట్టు 267 పరుగులు చేసి 113 పరుగలకే సెయింట్ ప్యాట్రిక్స్ జట్టును ఆలౌట్ చేసి విజయం సాధించింది.
సెంచరీ కొట్టిన డీజీపీ సీవీ ఆనంద్
— Telugu Scribe (@TeluguScribe) August 30, 2026
సి-డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్షిప్లో అదరగొట్టిన సీవీ ఆనంద్
హైదరాబాద్ జిల్లాతో జరిగిన మ్యాచ్లో సికింద్రాబాద్ క్లబ్ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగి 126 (నాటౌట్) కొట్టిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ pic.twitter.com/JvVbHZAVtn














Click it and Unblock the Notifications