హర్మన్ సేనపై కింగ్ కోహ్లీ భావోద్వేగ పోస్ట్!
Virat Kohli: ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 సెమీ-ఫైనల్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి భారత మహిళల జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. అక్టోబర్ 30(గురువారం)న నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టుకు 339 పరుగుల భారీ లక్ష్యం లభించింది. ఈ లక్ష్యాన్ని భారత అమ్మాయిలు 49వ ఓవర్ మూడో బంతికి ఛేదించారు. భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా వంటి బలమైన ప్రత్యర్థిపై అద్భుతంగా రాణించడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చారిత్రక విజయాన్ని నమోదు చేసిన భారత మహిళల జట్టు ప్రపంచ కప్ చరిత్ర సృష్టించడానికి కేవలం ఒక విజయం దూరంలో ఉంది. ఇక ఫైనల్లో హర్మన్ సేన నవంబర్ 2(ఆదివారం) అదే మైదానంలో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
కింగ్ కోహ్లీ భావోద్వేగ పోస్ట్!
భారత మహిళల జట్టు సాధించిన ఈ అద్భుత విజయాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ప్రశంసించారు. కింగ్ కోహ్లీ తన 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ఖాతాలో హృదయాన్ని హత్తుకునే పోస్ట్ను పంచుకున్నారు. "ఆస్ట్రేలియా వంటి బలమైన ప్రత్యర్థిపై మన జట్టు ఎంత గొప్ప విజయాన్ని సాధించింది. అమ్మాయిలు అద్భుతమైన రన్-ఛేజ్ చేశారు. ముఖ్యంగా, జెమీమా ఒక పెద్ద మ్యాచ్లో అసాధారణ ప్రదర్శన కనబరిచింది. ఈ విజయం ధైర్యం, ఆత్మవిశ్వాసం, నిజమైన అభిరుచికి నిదర్శనం. అద్భుతంగా ఆడారు టీమిండియా." అని కింగ్ కోహ్లీ పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ చేసిన ఈ పోస్ట్ జట్టుపై ఆయనకున్న ప్రేమ, అభిమానాన్ని తెలియజేస్తోంది.

జెమీమా అద్భుత ప్రదర్శన
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. కానీ అందరికంటే ఎక్కువగా జెమీమా రోడ్రిగ్స్ ఆకట్టుకుంది. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో జెమీమా రోడ్రిగ్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆమె ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేయడమే కాకుండాపెద్ద మ్యాచ్లలో జట్టుకు ఆమె ఎంత నమ్మకమైన క్రీడాకారిణి అని నిరూపించింది. జెమీమా రోడ్రిగ్స్ 134 బంతుల్లో 127 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమెకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ (10 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా 88 బంతుల్లో 89 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది.
What a victory by our team over a mighty opponent like Australia. A great chase by the girls and a standout performance by Jemimah in a big game. A true display of resilience, belief, and passion. Well done, Team India! 🇮🇳
— Virat Kohli (@imVkohli) October 31, 2025
ఫైనల్లో దక్షిణాఫ్రికా సవాల్
ఫైనల్లో భారత జట్టు ఇప్పుడు దక్షిణాఫ్రికా సవాలును అధిగమించాల్సి ఉంది. దక్షిణాఫ్రికా జట్టు తొలి సెమీ-ఫైనల్లో ఇంగ్లాండ్ను 125 పరుగుల భారీ తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. ఈ రెండు జట్లు కూడా తమ తొలి ప్రపంచ కప్ టైటిల్ కోసం పోరాడనున్నాయి.












Click it and Unblock the Notifications