మానస సంచరరే!
హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్టానవర్గం పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆడింది ఆట, పాడింది పాటగా ఉంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ను ఆ పదవిలో కొనసాగించాలా లేదా అన్న విషయం కూడా రాజశేఖరరెడ్డి నిర్ణయానికి లోబడి ఉండడం వైఎస్ హవాకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇంతటి పవర్ సిఎం ఉండడం ఇదే. వైఎస్ అధికారంలోకి వచ్చాక వర్షాలు బాగా పడడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆయన మీద వ్యతిరేకత లేదు. నీటిపారుదల ప్రాజెక్టులకు ఆయన ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సానుకూల వాతావరణం ఏర్పడింది. కానీ అన్నీ సజావుగా జరుగుతున్నాయా అంటే అది ప్రశ్నార్ధకమే.
అవినీతి విషయంలో టిడిపి ఎంతో కాంగ్రెస్ కూడా అంతే. ఆ విషయంలో రాజశేఖరరెడ్డిని ప్రత్యేకంగా ఆక్షేపించలేం. చంద్రబాబు నాయుడు వేసిన బాటలో ఆయన శరవేగంగా సాగిపోతున్నారు. అవినీతి విషయంలో ఇద్దరూ దొందూ దొందే అయినా ఎవరు ఎక్కువ ప్రజాస్వామికంగా ఉన్నారన్నది ఇక్కడ చర్చనీయాంశం. చంద్రబాబు నాయుడు మంత్రులను ఎంపికచేసుకోవడంలో ఒక పద్ధతిని అనుసరించేవారు. ఆయన రాష్ట్రంలో అత్యధిక సంఖ్యాకులైన బీసీలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇచ్చారు. రాజశేఖరరెడ్డి హయాంలో రెడ్లకు. కాపులకు మాత్రమే ప్రాధాన్యం ఉందన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా. మంత్రివర్గాన్ని విస్తరించకుండా వైఎస్ కాలం గడుపుకుంటూ రావడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
కాటికి కాళ్ళు జాపుకున్న మంత్రులకు కూడా అదనంగా రెండు మూడు శాఖలను ఆయన కేటాయించడంతో ఫైళ్ళు పేరుకు పోతున్నాయి. వైఎస్ ఇంత మొండిగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జనాంతికంగా వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో నిత్య అసమ్మతివాదిగా పేరున్న వైఎస్కు అసమ్మతి ఎక్కడ ప్రారంభమవుతుందో, ఎక్కడ విస్తరిస్తుందో బాగా తెలుసు. మంత్రివర్గాన్ని విస్తరించిన మరుక్షణంలో అసమ్మతి పడగ ఎత్తుతుందని ఆయన భయం. అందువల్ల ఆయన సాధ్యమైనంతవరకు మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తూ వస్తున్నారు. మంత్రివర్గాన్ని విస్తరించమని అధిష్టానవర్గం నుంచి సంకేతాలు అందుతున్నా ఆయన తనదైన నవ్వు నవ్వునవ్వుకుని కాలక్షేపం చేయడం సీనియర్ ఎమ్మెల్యేలకు కడుపు మంటగా ఉంది.