పల్లెల్లో కార్పరేట్ చిచ్చు
హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి రానున్న రెండేళ్ళ కాలం గతంలో లాగా నల్లేరు మీద నడకలా ఉండే అవకాశం లేదు. ఇప్పటి వరకు ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానవర్గం అనేక విషయాల్లో చెక్ పెట్టవచ్చు. అసమ్మతి ఎమ్మెల్యే, మాజీ సిఎల్పీ నాయకుడు పి. జనార్ధన రెడ్డికి ఎట్టకేలకు సోనియా గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వడంతో ఇంకా ముదరని అసమ్మతి శిబిరంలో ఆనందం చోటు చేసుకుంది. మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారంతా రహస్య సమాలోచనలు జరుపుతున్నారు. పి జనార్ధనరెడ్డికి ఇంగ్లీషు రాకపోయినా, శుద్ధ హిందీ అంతంత మాత్రంగానే వచ్చినా ఆయన సోనియా గాంధీకి అర్ధమయ్యేలా తన వాదనను విన్పించినట్టు తెలిసింది. పేజీకి ఆరు లైన్లు మాత్రమే ఉండేలా ఆయన మంచి ఇంగ్లీషులో తన వాదనను ఆమె ముందు పెట్టినట్టు చెబుతున్నారు.
రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అవినీతి కూపంలో మునిగిపోయిందని, జనంలో విశ్వసనీయత పడిపోతోందని పిజెఆర్ చెప్పిన విషయాలను సోనియాగాంధీ సానుకూలంగా విన్నారు. సోనియాగాంధీ సిఫార్సుతో పిజెఆర్కు మంత్రి పదవి వచ్చినా ఆశ్చర్యం లేదని ఆయన వర్గీయులు అంటున్నారు. ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా పరోక్షంగా లాభ పడిన ముఖ్యమంత్రి అనుచరుల గురించి అధిష్టానవర్గం ఆరా తీస్తున్నట్టు తెలిసింది. అదే విధంగా ఎన్నికల్లో ప్రధాన నినాదమైన నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకగా సాగడంపై కూడా హైకమాండ అసంతృప్తిగా ఉంది. నక్సలైట్లతో చర్చలు విఫలమైనప్పుడు అలా ఎందుకు జరిగిందని సోనియా గాంధీ వైఎస్ను నిలదీసిన విషయం తెలిసిందే. సిఎం చిరకాల మిత్రుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచంద్రరావు మీద సోనియాగాంధీకి ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడానికి సోనియా గాంధీ నిర్ద్వందంగా నిరాకరించడానికి కారణం ఇదే. పిసిసి అధ్యక్షుడు కేశవరావు కూడా కెవిపిపై సోనియా గాంధీకి ఇటీవల ఫిర్యాదు చేశారు.
గత స్ధానిక సంస్ధల ఎన్నికల్లో తెలుగుదేశం అనూహ్యంగా పుంజుకోవడం కూడా అధిష్టానవర్గానికి బాధ కలిగించింది. తెలంగాణ రాష్ట్ర సమితి పలుకుబడి బాగా తగ్గినట్టు తెలుసుకున్నప్పటికీ, వైఎస్కు చెక్ పెట్టడానికే హైకమాండ్ ఇప్పటికీ కె. చంద్రశేఖరరావుతో సన్నిహితంగా ఉంటోంది. ఈ నేపధ్యంలో వైఎస్ విధిలే క వి. హనుమంతరావు , జి వెంకటస్వామి వంటి నాయకులతో సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. హనుమకు, వెంకటస్వామికి సోనియాగాంధీ వద్ద విలువ ఉన్న విషయం తెలిసిందే.