వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంకా ఎన్నాళ్ళు, ఇక తప్పదు

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> కాంగ్రెస్‌ 20-02-2006

Y S Rహైదరాబాద్‌: ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తున్న కొద్దీ కాంగ్రెస్‌ నాయకుల్లో అసహనం పెరుగుతోంది. అయినా ఏమీ చేయలేని అశక్తత వారిది. మంత్రివర్గంలో తమకు సరైన ప్రాతినిధ్యం లేదని కొన్ని కులాలు, వర్గాల వారు భావిస్తున్నారు. ముఖ్యంగా కమ్మ కులానికి చెందిన ఒకరికి (పిన్నమనేని వెంకటేశ్వరావు) మాత్రమే ప్రస్తుత మంత్రివర్గంలో స్ధానం లభించింది. మంత్రివర్గ విస్తరణ జరిగినా చిత్తూరు జిల్లాకు చెందిన గాలి ముద్దుకృష్ణమనాయుడికి మాత్రమే ఈ వర్గం నుంచి అవకాశం లభించవచ్చు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడ మంత్రి పదవిని ఆశిస్తున్నప్పటికీ ఆయన భార్య పురంధరేశ్వరికి కేంద్రంలో మంత్రి పదవి లభించినందువల్ల ఆయన ఆశలు వదులుకోవలసి వచ్చింది.

రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో రెడ్లకు, కాపులకు ఎక్కువ ప్రాతినిధ్యం లభించిందన్న అభిప్రాయం మిగితా వర్గాల్లో ఉంది. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు కమ్మవారికి కనీసం మూడు నాలుగు మంత్రి పదవులు లభించేవి. ఇప్పుడు కేంద్రంలో ఇద్దరు కమ్మ కులానికి చెందిన మంత్రులు ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఈ వర్గానికి ప్రాతినిధ్యం పెంచాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కోటరీ భావిస్తోంది. బిసిలకు జనాభాకు తగ్గ నిష్పత్తిలో మంత్రి పదవులు లభించనప్పటికీ భారీ నీటిపారుదల, రెవిన్యూ, వాణిజ్యపన్నులు, వ్యవసాయం వంటి ముఖ్యమైన శాఖలు లభించాయి. చంద్రబాబు నాయుడు హయాంలో కూడా బిసిలకు ముఖ్యమైన శాఖలు ఉండేవి. ఒక్క విజయభాస్కరరెడ్డి హయాంలోనే బిసిలకు ప్రాధాన్యం లేని శాఖలు లభించాయి.

ఇప్పుడు కాకపోయినా వైఎస్‌ కొన్ని నెలల తర్వాతైనా మంత్రివర్గాన్ని విస్తరించక తప్పని పరిస్ధితులు ఉన్నాయి. సీనియర్‌ మంత్రులు అదనపు శాఖలను నిర్వహిస్తున్నా వారు అన్ని పనుల మీదా దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు. దీనివల్ల ఫైళ్ళ కదలికల్లో జాప్యం జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ జరిగితే ఈ కింది వారికి జిల్లాల వారిగా మంత్రి పదవులు లభించవచ్చు.

మంత్రి పదవుల కోసం నలభైమంది చకోర పక్షుల్లా ఎదురు చూస్తుండగా, తొమ్మిది మందికి మాత్రమే అవకాశం కల్పిస్తే, మిగిలిన వారు అసమ్మతి శిబిరం నడుపుతారన్న సత్యం వైఎస్‌కు తెలియనిది కాదు. అసమ్మతి రాజకీయాల్లో ఆయనకు ఉన్నంత అనుభవం మరే నాయకుడికీ లేదు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఒక ముఖ్యమంత్రికి ఎసరు పెట్టాలంటే అధిష్టానవర్గం వద్ద ఏం చేయాలో వైఎస్‌కు తెలుసు. ఆ అనుభవంతో ఆయన తన పార్టీ వారు ఎసరు పెట్టకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి పదవులను ఆశిస్తున్న వారి వివరాలు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌ నుంచి ముఖేష్‌కు మంత్రి పదవి దక్కవచ్చు. రంగారెడ్డి జిల్లానుంచి ఎవరికీ అవకాశం ఉండదు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉండగా, హనుమంతు అయ్యప్పదొర, కొండ్రు మురళి, నరేశ్‌ కుమార్‌ అగర్వాల్‌ మంత్రి పదవులను ఆశిస్తున్నారు. విజయనగరం జిల్లాలో శత్రుచర్ల విజయరామరాజును మంత్రివర్గం నుంచి తొలగిస్తారని వినిపిస్తోంది. అయితే తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్న బొత్స సత్యనారాయణ అలాగే ఉంచి, శత్రుచర్లను తొలగించడం వ్యతిరేకతకు దారి తీయవచ్చన్న అభిప్రాయమూ ఉంది. విజయనగరం జిల్లా నుంచి పి సాంబశివరాజు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఈ జిలా నుంచి గండి బాబ్జీ, గురుమూర్తి రెడ్డి మంత్రి పదవులను ఆశిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మంత్రి అయిన గొల్లపల్లి సూర్యారావును తొలగించి, చిట్టూరి రవీంద్ర, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌లలో ఒకరికి పదవి దక్కవచ్చు. పశ్చిమగోదావరి జిల్లాకు మంత్రివర్గంలో స్ధానం లేదు. వట్టి వసంతకుమార్‌కు మంత్రి పదవి దక్కవచ్చు. మాగంటి వెంకటేశ్వరరావు, పితాని సత్యనారాయణ కూడా మంత్రి పదవులను ఆశిస్తున్నారు.

కృష్ణా జిల్లాలో ఇద్దరు మంత్రులను కొనసాగిస్తూనే మరొకరికి అవకాశం కల్పించవచ్చు. చనుమోలు వెంకటరావు, మండలి బుద్ధప్రసాద్‌, బూరగడ్డ వేదవ్యాస్‌, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను కూడా మంత్రి పదవులను ఆశిస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి గాదె వెంకటరెడ్డి, గుదిబండి వెంకటరెడ్డి, వెంకట రమణ మంత్రి పదవులను ఆశిస్తున్నారు. తన కుమారుడు నాందెండ్ల మనోహర్‌కు మంత్రి పదవి ఇప్పించుకోడానికి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్లు భాస్కరరావు ఢిల్లీ స్ధాయిలో ప్రయత్నిస్తున్నారు.. నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి పదవి ఖాయమన్న నమ్మకంతో ఉన్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నవారి సంఖ్య అధికంగా ఉంది. గాలి ముద్దు కృష్ణమనాయుడు, గల్లా అరుణ, చీఫ్‌విప్‌ కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఆర్‌ చెంగారెడ్డి, పీలేరు రామచంద్రారెడ్డి, జి కుతూహలమ్మ తీవ్రంగా పోటీపడుతున్నారు. కర్నూలు జిల్లాకు సంబంధించి మంత్రి మారెప్పను తొలగించవచ్చు. ఇ.ప్రతాప్‌ రెడ్డి, కె.రాంభూపాల్‌ రెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి మంత్రి పదవులను ఆశిస్తున్నా వీరిలో ఎవరికీ పదవి దక్కకపోవచ్చు. కడప, అనంతపురం జిల్లాల నుంచి విస్తరణలో ఎవరికీ అవకాశం ఉండదు.

మహబూబ్‌ నగర్‌ జిల్లా నుంచి జి. చిన్నారెడ్డి, శంకర్‌రావు, గురునాథ్‌ రెడ్డి మంత్రి పదవులను ఆశిస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్‌ దామోదర్‌ రెడ్డి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఈ జిల్లాకు చెందిన హోం మంత్రి జానారెడ్డి శాఖ మార్పును కోరుకుంటున్నారు. మెదక్‌ జిల్లా మంత్రి ఫరీదుద్దీన్‌ను తొలగిస్తే, సునీతా లక్ష్మారెడ్డికి అవకాశం దక్కుతుంది. ఖమ్మం జిల్లాలో కూడా మంత్రి పదవులను ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. వనమా వెంకటేశ్వరరావు, సంభాని చంద్రశేఖర్‌, ఆర్‌ వెంకటరెడ్డి మంత్రి పదవులపై తీవ్ర ఆశలు పెట్టుకున్నారు. చివరికి డార్క్‌ హార్స్‌ జలగం వెంకట్రావుకు పదవి దక్కే అవకాశం లేదు. కరీంనగర్‌ జిల్లా నుంచి టి జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ శ్రీధర్‌బాబుల్లో ఒకరికి పదవి దక్కనుంది. ద్రోణం రాజు సత్యనారాయణ మరణించారు కాబట్టి అదే బ్రాహ్మణ వర్గానికి చెందిన శ్రీధర్‌ బాబుకు అవకాశం ఉండవచ్చు. వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాలకు విస్తరణలో అవకాశముండదు. ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఎ. ఇంద్రకరణ్‌ రెడ్డి. సి.రామచంద్రారెడ్డి మంత్రి పదవులను ఆశిస్తున్నారు.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X