పోలీసుల మాయాతంత్రం
హైదరాబాద్: పిసిసి అధ్యక్షుడు కే కేశవరావు ఇతర పార్టీల వారికే కాక కాంగ్రెస్ వారికి కూడా ఒక విదూషకుడు (కమెడియన్)గా కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పట్టుబట్టి ఆయనను ఈ కీలక పదవిలో నియమింపజేయడం వెనుక ఉపయోగించిన తెలివితేటల అంతరార్ధం కేకే వ్యవహార శైలిని బట్టి తెలుస్తోంది. కేశవరావుకు సోనియాగాంధీ సముచిత విలువ ఇస్తున్నప్పటికీ ఆయన మాటల్లోని కన్ఫ్యూజన్ ఆమెకు ఇప్పటికే అర్ధమై ఉండాలి. ఒకప్పుడు జర్నలిస్టునని, ఆ తర్వాత ప్రొఫెసర్నని చెప్పుకునే కేశవరావు ఉండేది బంజారాహిల్స్ జర్నలిస్టు కాలనీలోనే. గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల్లో ఆయన ముఖ్యపాత్ర వహించారు. కానీ ఈ మతిమరపు ప్రొఫెసర్కు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు లేవు. ఎంసిహెచ్ డివిజన్లో నిలబడి గెలుస్తానన్న ఆత్మ విశ్వాసం ఆయనలో ఎప్పుడూ ఉండదు.
వామపక్షాలతో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చర్చలు విఫలం కావడానికి కేశవరావే కారణమన్న విమర్శలు వచ్చాయి. ఈ విషయం సోనియాగాంధీ వరకు వెళ్ళిందని మీడియా ప్రతినిధులు ప్రస్తావించడంతో కంగారు పడిపోవడం కేశవరావు వంతయింది. ఆయన ఆత్మరక్షణ లో పడిపోయారు. ఇటువంటి లక్షణం నాయకత్వ పటిమను ప్రతిబింబించదు. స్వతహాగా తెలంగాణ వాది అయిన కేశవరావు మనసు ఒక చోట మనువు ఒక చోట అన్నట్టు వ్యవ హరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులతో సీట్ల సర్దుబాటు చర్చల్లో చుట్టరికం ధోరణిని ప్రదర్శించిన కేకే, వామపక్షాలతో చర్చల సందర్భంగా పరాయి తనాన్ని బయటపెట్టుకున్నారు. సిపిఐ అగ్రనేత సురవరం సుధాకరరెడ్డి మొహం ఇంకా ఎర్రగా మారిపోడానికి ఇదే కారణం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో అనేక రకాలుగా ప్రకటనలు చేస్తున్న కేశవరావు ఇటు రాజశేఖరరెడ్డిని, అటు తెలంగాణ కాంగ్రెస్ వాదులను, మరో వైపు టిఆర్ఎస్ చంద్రశేఖరరావును ఒకేసారి మెప్పించడానికి విఫల ప్రయత్నం చేస్తున్నారు. అనుకోకుండా పిసిసి అధ్యక్షుడైన కేశవరావు ఆ తర్వాత బోనస్గా రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకున్నారు. ఇంతకాలం కాంగ్రెస్ పొర్టీని నమ్ముకుని ఉన్నందుకు ఆయన ఆశించిన దానికంటే ఎక్కువే దక్కింది. ఇటువంటి కన్ఫ్యూజ్డ్ పిసిసి అధ్యక్షుడిని పెట్టుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి ధన్యులు. కేకేను, ఎమ్మెస్ను, చంద్రశేఖరరావును చూసుకుని వైఎస్ మరికొంత కాలం పాటు తన శైలిలో నవ్వుకోవచ్చు.