సల్మాన్ ఖాన్ చుప్కే చుప్కే....
హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రంగరాజన్ నిజానికి రాజకీయాల మనిషి కాదు. ఫక్తు బ్యూరోక్రట్. ప్రొఫెషనల్ కూడా. ఆయనకూ రాజకీయాలకు ఏలాంటి సంబంధం లేదు. అయితే రాజకీయనాయకులు ముఖ్యంగా ఆర్ధిక సంస్కరణలను భుజానమోస్తున్న నేతలకు ఆయన అత్యంత ప్రీతిపాత్రుడు. ఆ యిష్టమే ఆయన్ను గవర్నర్గా ఆంధప్రదేశ్ రాజభవన్కు చేరిస్తే ఇప్పుడు ఏకంగా కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఢిల్లీ పీఠం చేర్చనున్నది.
ఈ మధ్య కాలంలో అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మారిన ఆర్ధిక మంత్రి యశ్వంత్సిన్హాను ఆ పదవినుంచి తప్పించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రంగరాజన్కు ఆ పదవిని కట్టబెట్టాలని ప్రధాని వాజ్పేయి తీవ్రంగా యోచిస్తున్నట్టుగా తెలిసింది. స్టాక్ మార్కెట్ కుంభకోణం, యూటిఐ స్కామ్, నానాటికీ క్షీణిస్తున్న దేశ ఆర్ధిక పరిస్థితి నేపథ్యంలో సిన్హాను తప్పించాలనే ఒత్తిడి ఈ మధ్య ప్రధానిపై ఎక్కువయింది. సంఘ్పరివార్ కూడా సిన్హా విషయంలో మొదటి నుంచి తీవ్ర అసంతృప్తితో వుంది. సిన్హాను అనేక మార్లు వెనకేసుకువచ్చిన ప్రధాని వాజ్పేయి కూడా ఈ మధ్య కాలంలోని పరిణామాలతో మనసు మార్చుకున్నట్టుగా వినికిడి.
పారిశ్రామిక, వాణిజ్య వర్గాలకు సంబంధించిన వివిధ లాబీల వత్తిడికి సిన్హా తేలిగ్గా లొంగిపోతారన్న అభిప్రాయం వుంది. ఒక గ్రూప్ వత్తిడి వల్ల ఒక ప్రధాన నిర్ణయం తీసుకునే సిన్హా సదరు నిర్ణయం వల్ల నష్టపోయే గ్రూప్లు ఒంటికాలి మీద లేచే సరికి తప్పు దిద్దుకోవడానికి మరో నిర్ణయం చేస్తారని ఈ క్రమంలో వ్యవస్థకు మొత్తంగా జరుగుతున్న నష్టాన్ని ఆయనే మాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదని అభియోగాలు వున్నాయి. అందువల్ల ఆయన్ను తప్పించి ఆర్ధిక మంత్రిగా అన్ని వర్గాలను రంజింపజేయగల సమర్ధున్ని ఆ పదవిలో పెట్టాలని ఎన్డిఎ నేతలు యోచిస్తున్నారు. వారి దృష్టిలో విదేశాంగ మంత్రి జస్వంత్సింగ్ పేరు కూడా వున్నట్టు వినికిడి. అయితే రంగరాజన్ పేరుకు ఎన్డిఎ ప్రధాన మిత్రపక్షం తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడునుంచి గట్టిమద్దతు లభిస్తున్నట్టు చెబుతున్నారు.
రంగరాజన్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా వున్న కాలంలోనే దేశంలో ఆర్ధిక సంస్కరణల అమలు ఊపు అందుకున్నాయి. అప్పట్లో పివి ప్రభుత్వం ప్రతిపాదించిన అనేక సంస్కరణలకు ఆర్బిఐ గవర్నర్గా కార్యాచరణలోకి తెచ్చిన ఘనత రంగరాజన్కు వుంది. ఎక్కడా సమతౌల్యం తప్పకుండా అన్ని వర్గాలను సంతోషపెట్టే విధంగా రంగరాజన్ హయాంలో ప్రారంభమైన స్ట్రక్చురల్ అడ్జెస్ట్మెంట్స్కు ఇప్పటికీ ప్రశంసలు లభిస్తుంటాయి.
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఆయన సాధించిన విజయాలతో ఆకర్షితుడైన కారణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరికోరి ఆయన్ను పదవీవిరమణ చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా తెచ్చుకున్నారు. కీలకమైన ఆర్ధిక నిర్ణయాల విషయంలో రంగరాజన్ సలహాలను చంద్రబాబు తీసుకుంటారని అంటారు. రంగరాజన్ కేంద్ర మంత్రిగా వుంటే ఆంధ్రకు అది మరింత లాభమని కూడా చంద్రబాబు భావిస్తున్నారు.
గతంలో కాంగ్రెస్ పాలనలో ఆర్ధికమంత్రిగా ఆర్బిఐ మరో మాజీ గవర్నర్ మన్మోహన్సింగ్ సమర్ధంగా బాధ్యతలు నిర్వహించిన విషయం విదితమే. కాంగ్రెస్ అమ్ములపొదిలో మన్మోహనాస్త్రం వున్నట్టుగా తమకు కూడా రంగరాజన్ పదునైన అస్త్రంగా మారే అవకాశం వున్నదని, ఇప్పుడు వెల్లువెత్తుతున్న విమర్శలకు అడ్డుకట్టపడుతుందని ఎన్డిఎ నేతలు అనుకుంటున్నారు.
పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు, మేధావి వర్గాలు రంగరాజన్ నియామకం పట్ల సంతృప్తి చెందే అవకాశం వున్నది. మరో వైపు అన్నాడిఎంకెతో సాగుతున్న సమరంలో దృష్ట్యా రంగరాజన్కు పదవి తమిళనాడు ప్రజలను కూడా సంతోషపెట్టే అవకాశం వున్నది. ప్రధాని వాజ్పేయి సెప్టెంబర్ 20న విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లేముందు కేబినెట్లో మార్పు చేర్పులు జరిగే అవకాశం వున్నదని చెబుతున్నారు.