చంద్రబాబు ఇంకా మారాలి!
చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని మహా కూటమి పైకి బాగా కనిపిస్తున్నా దాని లొసుగులు దానికున్నాయి. అనేక స్ధానాల్లో మిత్రుల మధ్య కోల్డ్ వార్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం మేనిఫెస్టోలో పేదలకు, మధ్యతరగతి వారికి అనేక వరాలు కురిపించినా చంద్రబాబు నమ్మే స్ధితిలో ప్రజలున్నారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. తాను అధికారంలో ఉన్నప్పుడు సబ్సీడీలను, సంక్షేమ పథకాలను నిర్లక్ష్యం చేసి ఆకాశ మార్గంలో విహరించిన ఆయన మీద కోపాన్ని గ్రామీణ పేదలు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు.
అయితే ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కసి ఆయనలో కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ కు ధన బలం సహజంగా అధికంగా ఉంటుంది. కాంగ్రెస్ ఖర్చు చేసే దానిలో సగమైనా ఖర్చు చేయడానికి ధన సమీకరణ చేయాలన్న కృత నిశ్చయంతో తెలుగుదేశం పార్టీ ఉంది. టీఅర్ ఎస్ అభ్యర్ధులపై పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేకపోయినా ఉభయ కమ్యూనిష్టు అభ్యర్ధుల ఖర్చును తెలుగుదేశమే భరించవలసి ఉంటుంది.
తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రధాన వెబ్ సైట్లలో పార్టీ ప్రకటనలు ప్రారంభించింది. ఎస్ ఎం ఎస్ ల ద్వారా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం మొదలైంది. బిజెపి కూడా వెబ్ సైట్ల ద్వారా ప్రచారం మొదలు పెట్టింది. బిజెపి-ప్రజారాజ్యం దగ్గరవుతున్న సూచనలు చంద్రబాబును కలవరపెట్టినా, బిజెపితో కలిసేది లేదని చిరంజీవి స్పష్టం చేయడంతో బాబు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు తన విశ్వసనీయత పెంచుకోవాలంటే ఇంకా ఎన్నో మెట్లు కిందికి దిగిరావలసి ఉంటుంది.