బాలకృష్ణ కాల్పులకు ఐదేళ్ళు
ఆనాడు బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల్లో నిర్మాత బెల్లంకొండ సురేష్, జ్యోతిషుడు సత్యనారాయణ చౌదరి తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరినీ అపోలో ఆస్పత్రిలో చేర్పించగా, కాల్పులు జరిపినట్టు ఆరోపణ ఉన్న బాలకృష్ణను అరెస్టు చేయకుండా కేర్ ఆస్పత్రికి తరలించడం వివాదాస్పదమైంది. ఆ తర్వాత ఆయనను నిమ్స్ కు తరలించారు. బాలకృష్ణ మానసిన ఒత్తిడిలో ఉన్నారన్న కారణం మీద అనేక రకాల వైద్య నిపుణులు ఉన్నందువల్ల నిమ్స్ కు రిఫర్ చేసి ఉంటారని అప్పటి నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు ఇప్పుడు చెబుతున్నారు.
బాలకృష్ణ తన భార్య వసుంధర రివాల్వర్ తో బెల్లంకొండను, సత్యనారాయణ చౌదరిని కాల్చినట్టు తమ ప్రాధమిక దర్యాప్తులో తేలినట్టు అప్పటి దర్యాప్తు అధికారి చంద్రమౌళి నేడు కూడా నిర్ధారించారు. అయితే గాయపడినవారు కోర్టులో తమను బాలకృష్ణ కాల్చలేదని చెప్పడంతో కేసు వీగిపోయిందని ఆయన ఆ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సాక్షులు ఎదురుతిరిగినప్పుడు పోలీసులు చేయగలింగింది ఏమీ లేదని ఆయన అన్నారు.
"నేను నిర్మాతను. నేను లేకపోతే నువ్వు లేవు" అని బెల్లంకొండ అన్నందుకు తీవ్రంగా ఆగ్రహించిన బాలకృష్ణ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. అంత పెద్ద కేసు కాల గర్భంలో కలిసిపోడానికి కారణం పెద్దవాళ్ళు జోక్యం చేసుకోవడమేనని విమర్శలున్నాయి. ఈ సమాజంలో సంపన్నులకు ఒక న్యాయం పేదవారికి మరో న్యాయం అమల్లో ఉందనడానికి ఈ కేసు చక్కటి ఉదాహరణ. ముఖ్యమంత్రి వైఎస్ కుమారుడు జగన్ బాలకృష్ణ అభిమాని కావడంతో ఆయన పార్టీలకు అతీతంగా జోక్యం చేసుకుని, పోలీసులకు చెప్పించి బాలకృష్ణను గట్టె క్కించినట్టు ఒక కథనం. అప్పుడే కాంగ్రెస్ లో చేరి ఎంపీ అయిన పురంధరేశ్వరి చొరవతో వైఎస్ ప్రభుత్వం బాలకృష్ణ కేసును నీరుగార్చినట్టు మరో కథనం. ఈ కేసులో బాలకృష్ణతో పాటు ఆయన భార్య వసుంధర మీద, పనిమనిషి కనకయ్య మీద కూడా కేసులు నమోదైనా అందరూ నిర్దోషులుగా బయటపడ్డారు.
ఆ తర్వాత బాలకృష్ణ ఇంట్లో ఒక ఒరియా సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యాడు. బాలకృష్ణ కాల్పుల కేసుకు, ఈ హత్యకు ఏమైనా లింక్ ఉందేమోనన్ని కోణంలో దర్యాప్తు చేయాల్సిన పోలీసులు నిర్లక్ష్యం వహించినట్టు విమర్శలు ఉన్నాయి. ఒక సామాన్యుడి ఇంట్లో కాల్పులు జరిగితే వేధించి వెంటాడే పోలీసులు చట్టం సంపన్నుల చుట్టం అన్నరీతిలో వ్యవహరించడం దారుణం. బెల్లంకొండకు, బాలకృష్ణకు మధ్య కోర్టు వెలుపల రాజీ కుదర్చడంలో అప్పటి పోలీసు ఉన్నతాధికారులు విజయం సాధించారు. కథ కంచికి, బాలకృష్ణ ఇంటికి అన్న తరహాలో కథ సుఖాంతమైంది.