అల్లు చేతిలోనే 'కీ'

పార్టీని ముందుకు నడిపించడానికి, వెనక్కు నెట్టివేయడానికి కావాల్సిన తాళం చెవులన్నీ చిరంజీవి బావ మరిది, పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ చేతుల్లో ఉన్నాయని అంటున్నారు. అల్లు అరవింద్ వ్యూహం ప్రకారమే, రహస్య ఎజెండా ప్రకారమే పార్టీ నడుస్తోందని చెబుతున్నారు. చిరంజీవి కూడా అల్లు అరవింద్ చెప్పినట్లే నడుచుకుంటారని, అంతకు మించిన వెసులుబాటు ఆయనకు లేదని చెబుతున్నారు. అందువల్లనే ప్రజారాజ్యం పార్టీ నుంచి ప్రధాన నాయకులు ఒక్కరొక్కరే తప్పుకుంటున్నారని భోగట్టా.
నిజానికి, చిరంజీవి అల్లు అరవింద్ ను పక్కన పెట్టి తమ సలహాలు వింటే పార్టీని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు ధీటుగా నిలబెట్టగలమని అభిప్రాయపడినవాళ్లు కూడా ఉన్నారు. నిజానికి, ప్రజారాజ్యం పార్టీలో చేరిన చాలా మంది నాయకులకు ఆ సత్తా ఉంది. అటువంటి నాయకులే తదనంతర కాలంలో పార్టీ నుంచి వెళ్లిపోయారు. పార్టీలో చేసేదేమీ లేక వారు వెళ్లిపోతున్నట్లు కాస్తా స్పష్టంగానే చెప్పారు. చిరంజీవిపై వారికి ఇతోధిక గౌరవం ఉన్నట్లు కూడా వారి మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. వారు తాము పార్టీలో ఏమీ చేయలేకపోతున్నామని, కాంగ్రెసు పార్టీకి ప్రజారాజ్యం పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం బలపడుతోందని అన్నారే గాని చిరంజీవిని పల్లెత్తు మాట కూడా చాలా మంది నాయకులు అనలేదు. వారంతా పరోక్షంగా అల్లు అరవింద్ వ్యవహారాన్ని మాత్రమే ప్రస్తావించారని అనుకోవచ్చు. పరకాల ప్రభాకర్ లాంటి వారు ఆ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు.
అందువల్ల పార్టీని నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టడం గానీ, ప్రధాన రాజకీయ పార్టీలకు ధీటుగా నిలబెట్టడం గానీ చిరంజీవి చేతుల్లో లేదని, అల్లు అరవింద్ అనుకున్నదే అవుతుందని, అల్లు అరవింద్ ఎజెండా ప్రకారమే దాని భవిష్యత్తు ఉంటుందని, అల్లు అరవింద్ రహస్య ఎజెండా అమలైనంత కాలం ప్రజారాజ్యం ఎదగలేదని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇందులోని నిజానిజాలు ఎలా ఉన్నా అల్లు అరవింద్ ప్రజారాజ్యం పార్టీలో కీలకమని, చిరంజీవి కూడా ఆయన సలహాల ప్రకారమే నడుస్తారనేది బహిరంగ రహస్యమే.












Click it and Unblock the Notifications