చిరంజీవికి ఒక పాఠం
చిరంజీవి తన పార్టీ మీద కులం ముద్ర పడకూడదని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వంగవీటి రాధా, కేసినేని నాని పార్టీలో చేరడంతో అసలే కమ్మ-కాపు కులాల కురుక్షేత్రమైన కృష్ణా జిల్లాలో నిన్న కుంపట్లు రాజుకున్నాయి. కేసినేని నానిని అల్లు అరవింద్ ఆనేక ఆర్ధిక లావాదేవీలకు ఒప్పించి పార్టీలో చేర్చుకుని విజయవాడ అర్బన్ కన్వీనర్ పదవిని కట్టబెట్టారు. కమ్మ వర్గానికి చెందిన నాని ప్రముఖ ట్రాన్స్ పోర్ట్ ఆపరేటర్. ఆయన కొన్ని వందల వాహనాల్లో విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి ప్రజారాజ్యం పార్టీలో చేరారు.
ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన వంగవీటి రాధా పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహిత మిత్రుడు. పవన్ కోసం ఆయన ప్రజారాజ్యంలో చేరారు. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్న విషయం రాధా, నాని విషయంలో ధృవపడింది. నిజానికి కృష్ణా జిల్లా ప్రజారాజ్యం కన్వీనర్ విజయనిర్మల అయినప్పటికీ పెత్తనమంతా రాధాదే. విజయనిర్మల రాధా మనిషి. ఎన్నో దశాబ్దాలుగా విజయవాడ కేంద్రంగా జరుగుతున్న కమ్మ-కాపు కుల రాజకీయాలు ప్రజారాజ్యం ద్వారా మళ్ళీ వెలుగులోకి వచ్చాయి.
రాజకీయ పరిపక్వత, కులాల సమీకరణలు పెద్దగా తెలియని చిరంజీవి ఈ సమయంలో తన పార్టీలోని రాజకీయ కురువృద్ధులతో ఒక కమిటీ వేసి విజయవాడ గొడవలకు చెక్ పెట్టి ఉండాల్సింది. సంఘటన జరిగి 30 గంటలు అవుతున్నా చిరంజీవి మౌనం వహించడం వివిధ జిల్లాల్లోని కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలను పంపిస్తోంది.
కృష్ణాజిల్లా ప్రజారాజ్యం పార్టీలో కమ్మ, కాపు ఫ్యాక్టరే కాక యాదవ ఫ్యాక్టర్ ఒకటుంది. మాజీ ఎంపీ రెడ్డయ్య యాదవ్, మాజీ మంత్రి కఠారి ఈశ్వరకుమార్ ప్రజారాజ్యంలో చేరడంతో యాదవ కులస్తులు పెద్ద సంఖ్యలో ఆ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. కానీ ప్రజారాజ్యం జిల్లా శాఖలో కమ్మ, కాపు వర్గాలే కీలక పాత్ర వహిస్తున్నాయని, ఈ పార్టీలో సామాజిక న్యాయం లేదని కఠారి ఈశ్వరకుమార్ బహిరంగ ప్రకటన చేయడం, ఆయనను శాంతింపజేయడానికి అల్లు అరవింద్ ఫోన్లు చేయడంతో కృష్ణా జిల్లా రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.