కమలంతో కలవక తప్పదా?
బిజెపి గుర్తు కమలం. ప్రజారాజ్యం పార్టీ గుర్తు సూర్యుడు. కమలానికీ సూర్యుడికి ప్రకృతిలో ఎంతో సన్నిహిత సంబంధం. రాజకీయాల్లో కూడా ఆ సహజ సంబంధం ఏర్పడనుందా?
అక్కడే కీలక మలుపు ఉంది. చిరంజీవి సినిమా ఇంటర్వెల్ కు ముందు పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టు తెలిసింది. బిజెపి గుర్తు అయిన "కమలం" కోసం ప్రజారాజ్యం ముఖ్యుడు అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నారు. బిజెపితో పొత్తు పెట్టుకోకుండా కేవలం ఆ పార్టీ ఎన్నికల చిహ్నమైన "కమలం" ను వాడుకోవడం వరకే ఒప్పందం చేసుకోవాలన్న అతి తెలివి ప్రతిపాదనను అల్లు అరవింద్ బిజెపి అగ్ర నాయకుడు వెంకయ్య నాయుడు ముందు ఉంచినట్టు తెలుస్తోంది. గతంలో పొత్తు కోసం వెంకయ్యనాయుడు సీరియస్ గా ప్రయత్నించినా ప్రజారాజ్యం ససేమిరా అన్నది. ఇప్పుడు ఉమ్మడి గుర్తు కోసం ప్రజారాజ్యం దిగిరాక తప్పలేదు.
బిజెపితో పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓట్లు దూరమవుతాయన్న భయం చిరంజీవికి, మిత్రాకు ఉంది. కానీ దేనినైనా వ్యాపారంగా తీసుకునే అల్లు అరవింద్ వంటి వారు గుర్తు కోసం బిజెపితో కలిస్తే తప్పేమిటని చిరంజీవిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. అయితే చిరంజీవి ప్రజారాజ్యం ఉమ్మడి గుర్తు (రైలింజన్)ను కోర్టు ద్వారా సాధించుకునేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు.
బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి, ఆ గుర్తు వాడుకోడానికి పెద్ద తేడా ఏమీ ఉండదు.కమలం గుర్తుపై గెలిచే పీఅర్ పి అభ్యర్ధులు టెక్నికల్ గా బిజెపి సభ్యులే అవుతారు. దానికంటే బిజెపికి తగినన్ని లోక్ సభ స్ధానాలు (దాదాపు 15), అసెంబ్లీ స్ధానాలను తక్కువగా (40 లోపు) ఇచ్చి మిగితా స్ధానాల్లో పీఆర్పీ పోటీ చేయవచ్చు. బిజెపి వంటి పటిష్టమైన కేడర్ ఉన్న పార్టీ ద్వారా పీఅర్పి లాభపడవచ్చు. పీఅర్పీకి, చిరంజీవికి ప్రజల్లో ఉన్న ఆదరణ బిజెపికి బాగా లాభించవచ్చు. కేంద్రంలో అద్వానీని ప్రధానిని చేయడం, రాష్ట్రంలో చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయడం లక్ష్యంగా ఈ కొత్త కూటమి పనిచేసే అవకాశముంది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే మరి.