వైయస్ నీడ
జగన్ కు మద్దతుగా విచిత్రమైన ఎస్ఎంఎస్ ప్రచారం సాగుతోంది. ఇందిరా గాంధీ మృతి చెందిన వెంటనే రాజీవ్ గాంధీని ప్రధానిని చేయాలని, జగన్ ను ఎందుకు ముఖ్యమంత్రిని చేయకూడదని ఆ ఎస్ఎంఎస్ వ్యాక్యాలు. జగన్ తొలిసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. తమ కుటుంబానికి కంచుకోట అయిన కడప నుంచి ఆయన ఎన్నికయ్యారు. జగన్ పులివెందులలోని తన తొలి విద్యాభ్యాసం సాగించాడు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివారు. కాలేజీలో చదువుతున్నప్పుడు క్రీడల్లో చురుగ్గా పాల్గొని పలు షీల్డ్ లు సాధించారు. జగన్మోహన్ రెడ్డిని ఆయన మద్దతుదారులు యువ పారిశ్రామికవేత్తగా, ఆలోచనాపరుడిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ కు పాఠశాలకు వెళ్లే కూతురు ఉంది.
1972 డిసెంబర్ 21వ తేదీన జన్మించిన జగన్ కు రాజీవ్ గాంధీ స్ఫూర్తిప్రదాత. ఆయన వైయస్ జగన్మోహన్ రెడ్డి డాట్ కామ్ పేర వ్యక్తిగత వెబ్ సైట్ ను రూపొందించుకున్నారు. ఈ వెబ్ సైట్ లో జగన్ పారిశ్రామికవేత్తగా, మారుమూల ప్రాంతాల్లో ఉపాధి కల్పించడానికి కృషి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. వంద మందికి పైగా కాంగ్రెసు శాసనసభ్యులు, రాష్ట్రానికి చెందిన మెజారిటీ పార్లమెంటు సభ్యులు జగన్ కు బహిరంగంగా మద్దతు తెలుపుతున్నారు. మంత్రి కొండా సురేఖ లాంటి వారు హెచ్చరికల లాంటివి కూడా చేస్తున్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత పారిశ్రామికంగా పెద్ద లాబీని తయారు చేసుకున్నారు. చాలా మంది కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు, పారిశ్రామికవేత్తలు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారనేది బహిరంగ సత్యమే. వాటి కన్నా ముఖ్యంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ద్వారా కొద్ది మంది సంపన్నులుగా ఎదగడానికి ఆయన రాజకీయ ప్రాబల్యం పని చేసింది. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఒత్తిడి చేస్తున్న వారి వెనక ప్రధానంగా ఈ లాబీ ఉంది. రాష్ట్రంలో 150 దాకా ప్రత్యేక ఆర్థిక మండళ్లకు (సెజ్ లకు) శ్రీకారం చుట్టారు. చెప్పాలంటే రాష్ట్రాన్ని దేశ సెజ్ ల రాజధానిగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద యెత్తున జరిగింది. దీనికి ప్రధాన సూత్రధారి జగన్ అంటారు. ఈ లాబీ జగన్ ను ముఖ్యమంత్రిగా చేసి తమ వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక స్థితిగతుల్లో మార్పు లేకుండా చూసుకోవాలనే ప్రయత్నంలో ఉంది.