కెసీఆర్ కు కలిసొచ్చిన ఆర్ధిక మాంద్యం
ఇంతకు ముందు వివిధ ఐటి సంస్ధల్లో పనిచేసే తెలంగాణ ప్రొఫెషనల్స్ ఇతర ప్రాంతాల వారితో సులభంగా కలిసిపోయేవారు. వారికి తెలంగాణ చరిత్ర, పోరాటాల గురించి కాకుండా జావా, సి ప్లస్ లు, కెరియర్, అమెరికా ఉద్యోగాల మీదనే దృష్టి ఉండేది. ఇప్పుడు వారి మానసిక స్ధితి మారుతున్నట్టు కనిపిస్తోంది. అంతకు ముందు సాంకేతిక, ఉద్యోగ విషయాల కోసం సెర్చ్ చేస్తున్నవారు ఇప్పుడు తెలంగాణ పోరాట చరిత్ర గురించి సెర్చ్ చేస్తున్నారని తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక ఎన్నారై తన బ్లాగులో రాశారు.
కెసీఆర్ మాటి మాటికీ హింసారహితంగా ఉండమని చేస్తున్న విన్నపం మరో వ్యూహాత్మకమైనది. మాటిమాటికీ ఆయన అలా చెప్పడం ద్వారా తెలంగాణ గాంధీ అని పేరు తెచ్చుకుంటున్నప్పటికీ, హింసా మార్గంలో వెళ్ళదలుచుకున్న వారికి ఆనాటి స్వాతంత్ర్య సంగ్రామంలాగా వాళ్ళ దారి వారికి కన్పిస్తూనే ఉన్నది. కెసిఆర్ పై ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజానాయకుడిగా ఆయన బలం ఎంత ఉందో ఇప్పుడు ఆచరణాత్మకంగా తెలుస్తోంది.
రాష్ట్రంలో 1969నాటి పరిస్థితి రాకుండా ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత జి. వెంకటస్వామి అన్నారు. కేసీఆర్ అరెస్ట్ను ఆయన ఖండించారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులపై పోలీసులు లాఠీచార్జి చేయాల్సిన అవసరం అక్కడ ఏమీ లేదన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, విద్యార్ధులపై పోలీసుల దాడులు అమానుషమన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రతిఒక్క పౌరుడూ సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.