ముందున్నది మొసళ్ళ పండగా?
రోశయ్యకు అధిష్టానవర్గం స్వేచ్చ ఇస్తున్న కొద్దీ ఆయన ప్రత్యర్ధి వర్గంలో కసి పెరుగుతోంది. ప్రత్యర్ధి వర్గం గొడవలు చేస్తున్న కొద్దీ హైకమాండ్ కు రోశయ్య మీద సానుభూతి పెరిగిపోతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి లేని లోటును 80 శాతమైనా రోశయ్య తీర్చగలరని భావించ బట్టే ఆయనను హై కమాండ్ ముఖ్యమంత్రిని చేసింది. మొదట మంత్రుల నుంచి సహాయ నిరాకరణ, ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా రోశయ్య ఇప్పుడు కుదురుకున్నారు. అయితే వైఎస్ లా డైనమిక్ గా పనిచేస్తూ, ఏ ఎమ్మెల్యే ఏది అడిగినా ఆపని అయ్య్యేలా వైఎస్ చూసేవారు. పాతకాలం మనిషి అయిన రోశయ్య అలా చేయలేకపోతున్నారు. అయినా ఆ వ్యవహార శైలిలో ఆయన నడుచుకుంటూ బండి నడిపిస్తున్నారు.
గత ముఖ్యమంత్రులతో పోలిస్తే రోశయ్య అవినీతి చాలా చాలా తక్కువ. తన వాళ్ళు అనుకున్న వారికి కూడా ఆయన చాలా ఆచితూచి కానీ పనులు చేయడం లేదు. ఆయన దృష్టి రాష్ట్రమనే కుటుంబ పెద్దగా ఖజానా మీదనే ఉంది. అనవరపు ఖర్చులు తగ్గించుకుని, కాంట్రాక్టర్ల చెల్లింపులకు సంబంధించిన ఫైళ్ళపై నిర్ణయాన్ని కొన్ని నెలలపాటు వాయిదా వేసుకుని, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడంపై ఉంది.
అయితే రోశయ్య అసమర్ధుడని నిరూపించడానికి ప్రత్యర్ధులు పనిగట్టుకుని కొన్నిపాడు పనులు చేసే అవకాసముందన్న విషయం సిఎం దృష్టికి వచ్చింది. దీనిపై ఒక సుదీర్ఘ నివేదికను ఆయన సోనియాగాంధీకి, ఇతర అగ్ర నాయకులకు పంపినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో అనూహ్యంగా శాంతిభద్రతల పరిస్ధితి తలెత్తితే వాటి వెనుక కాంగ్రెస్ అసమ్మతి వాదుల హస్తాన్ని మొదట అనుమానించమని, సమగ్ర విచారణ జరిపించి దోషులపై చర్య తీసుకోమని రోశయ్య ముందుగానే హై కమాండ్ కు సూచించినట్టు చెబుతున్నారు.
చాలా ఆలస్యంగా తండ్రిగారు నివసించిన అధికార నివాసానికి వచ్చిన వై ఎస్ జగన్ చాలా శాంతియుతంగా, ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు కన్పిస్తోంది. తన వర్గీయులమని చెప్పుకునేవారు దుందుడుకు చర్యలకు పాల్పడకుండా ఆయన నివారించవలసిన అవసరం రాష్ట్ర విశాల ప్రయోజనాల రీత్యా ఉంది. మరీ ముఖ్యంగా ఆయన అప్ప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి పదవి విషయంలో తాను తొందరపడడం లేదని, తండ్రి రాజశేఖరరెడ్డి తలపెట్టిన అభివృద్ధి పనులు పూర్తయ్యేలాగా తాను రోశయ్యతో కలిసి పని చేస్తానని చెబుతూ ఉంటే ఆయన హుందాతనం మరింత పెరుగుతుంది. అయన అభిమానులమని చెప్పుకుంటున్నవారి తొందరపాటు చర్యలకు అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది.