వైఎస్ కు డబ్బు ఇబ్బంది
రాష్ట్రంలో ఒంటి చేత్తో కాంగ్రెస్ ను గెలిపించిన వైఎస్ రాజశేఖరరెడ్డి కేంద్రంలో అదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పెద్దగా ఆనందపడే విషయం కన్పించడం లేదు. నీటిపారుదల శాఖకు మూడు నెలల వరకు నిధులు అందే పరిస్ధితి లేదని సిఎం వైఎస్ నిన్న స్వయంగా ఆ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. ఈలోగా ఇతరత్రా పను లు చేసుకోమని ఆయన ఆదేశించారు. దీనితో నీటిపారుదల శాఖలో నీరసం వచ్చింది. ఈ శాఖ పెండింగ్ బిల్లులు ఇప్పటికే 7,500 కోట్లకు చేరాయి. అయితే "ప్రాధాన్య" చెల్లింపుల పేరిట అస్మదీయులకు డబ్బులు వెళ్తునాయి.
రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో ఉన్న మాట వాస్తవమేనని ఆర్ధిక మంత్రి రోశయ్య తనదైన శైలిలో ఇటీవల ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందువల్ల నిధులు ధారాళంగా వస్తాయన్న నమ్మకం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. కానీ ఆచరణలో అవి ఇప్పట్లో వచ్చేటట్టు కన్పించడం లేదు. రాష్ట్రానికి పేరుకు రోశయ్య ఆర్ధిక మంత్రి అయినా అసలు ఆర్ధిక మంత్రి వైఎస్ మిత్రుడైన కె విపి రామచంద్రరావు. చెల్లింపుల భారం ఎక్కువ కావడంతో వేడి ఆయన మీద కూడా పడింది. అంతకు ముందు తన సొంత మీడియా వ్యక్తులతో మంత్రాంగం చేస్తూ ఉండే ఆయన ఈ మధ్య ఎక్కువగా ఢిల్లీలో ఉండిపోతున్నారు. దానితో ప్రభుత్వ మీడియా అచేతనంగా అయిపోయింది.
ఇప్పుడు కొత్త సెజ్ లు లేవు, కొత్త చెల్లింపులు లేవు. గతంలో విలాసవంతంగా బిల్లులు తీసుకున్న కాంట్రాక్టర్లకు ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్ధితి ఏర్పడింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఆగిపోయిన "ప్రాధాన్య" చెల్లింపులు ఇప్పడు తెరమీదికి వచ్చాయి. ఆరో తేదీన ఆర్ధిక శాఖ జారీ చేసిన జీవోలో 440 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అందులో 70 కోట్ల రూపాయలు పులివెందులకు కృష్ణా జలాలను సరఫరా చేసే గండికోట రిజర్వాయర్ బాధితుల పునరావాసం కోసమే. దీనిని బట్టి ప్రభుత్వ ప్రాధాన్యతలను అంచనా వేసుకోవచ్చు.