కిరణ్ ను చిరంజీవి ఆదుకోగలరా?

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో చేరాలని నిర్ణయం తీసుకుంటే చిరంజీవి వెంట ఎంత మంది శాసనసభ్యులుంటారనేది చెప్పడం కూడా కష్టంగానే ఉంది. వైయస్ జగన్ లక్ష్యదీక్షకు మంగళవారం 18 మంది కాంగ్రెసు శాసనసభ్యులు, ఇద్దరు ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు, ఒక తెలుగుదేశం శాసనసభ్యుడు పాల్గొన్నారు. విజయవాడలో జగన్ వెంట ఉండే శాసనసభ్యులు 21 మంది లెక్క తేలింది. కాగా, జగన్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించిన ఇద్దరు, ముగ్గురు శాసనసభ్యులు విజయవాడకు రాలేదు. కానీ, వారు జగన్ వెంటే ఉంటారనేది స్పష్టంగా చెప్పవచ్చు. వైయస్ జగన్ కనీసం 30 మంది శాసనసభ్యులను కూడగట్టారనేది అర్థమవుతోంది. దీంతో దాదాపుగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడడానికి చిరంజీవి శాసనసభ్యులు సరిపోతారా అనేది సందేహంగానే ఉంది.
దాదాపు ఎనిమిది శాసనసభ్యులు చిరంజీవిని వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి జగన్ కోసం వారికి గాలి వేసినట్లు ప్రచారం కూడా జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదుకోవడానికి చిరంజీవి బలం సరిపోదని స్పష్టంగా తెలిసిపోతోంది. మజ్లీస్ కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు ఇస్తుందా అనేది అనుమానంగానే ఉంది. శాసనసభలో మజ్లీస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన తీరు ఆ విషయాన్ని పట్టిస్తోంది. అయితే, మజ్లీస్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చెప్పడం అంత సులభం కాదు. అయితే, చిరంజీవి ఒక్కరు మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెట్టలేరనేది అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications