జగన్ 'పరామర్శ' యాత్రలు!
మధురపూడి నుంచి కారులో రాజమండ్రి వచ్చిన జగన్ హర్షకుమార్ ఉన్న ఆస్పత్రికి వెళ్లారు. హర్షకుమార్ కుటుంబ సభ్యులను పీసీసీ కార్యదర్శి మురళి జగన్ కు పరిచయం చేశారు. 'ఇతను హర్ష పెద్దకొడుకు అని చెబుతుండగా...'నాకు తెలుసు..శ్రీరాజ్' అని జగన్ చెప్పారు.
హర్షకుమార్ ను పరామర్శించాక.. రోడ్డుమార్గంలో విజయవాడ చేరుకున్నారు. ఎమ్మెల్యే విష్ణు తండ్రి సుబ్బారావు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు జగన్ వస్తున్నట్లు తెలియగానే... నకిరేకల్, నార్కెట్పల్లి, చిట్యాలలో ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెసు నేతలు ఏర్పాట్లు చేశారు.
'వచ్చేనెల 8వ తేదీ తర్వాతే ఏ నిర్ణయమైనా ఉంటుంది. మీరు సహకరించాలి' అంటూ పార్టీ నాయకులను జగన్ కోరినట్లు తెలిసింది. విజయవాడలో విశ్రాంతి తీసుకుంటుండగా మంత్రి పార్థ సారథి, పలువురు ఎమ్మెల్యేలు జగన్ను కలిశారు.
వచ్చేనెల 8వ తేదీ తర్వాత తన నిర్ణయం ఉంటుందని, తనకు సహకరించాలని జగన్ కోరినట్లు సమాచారం. కృష్ణాజిల్లా ఓదార్పుకు రావాలని ఓ నేత కోరగా..'వచ్చేనెల 8 తర్వాత నిర్ణయం తీసుకుంటాను. కృష్ణా జిల్లాలో కూడా ఓదార్పు యాత్ర ఉంటుంది' అని జగన్ చెప్పినట్లు తెలిసింది.