సోనియా కాల్ తో మారిన వివేకా
ఇడుపులపాయలో వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన తర్వాత వైయస్ వివేకానంద రెడ్డి వైయస్ జగన్ ను కలవడానికి వెళ్లారు. ఇద్దరి మధ్య సంభాషణ కాస్తా హాట్ గానే జరిగినట్లు తెలుస్తోంది. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన వైయస్ వివేకానంద రెడ్డి తాను శాశ్వతంగా రాజగకీయాల నుంచి తప్పుకుంటానని కూడా చెప్పారట. అయితే, ఆ తర్వాత వెంటనే వైయస్ వివేకానంద రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైయస్ జగన్ తో విభేదిస్తూ కాంగ్రెసుతో ఉంటానని చెప్పడమే కాకుండా సోనియా గాంధీని ప్రశంసలతో ముంచెత్తారు.
విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న సోనియా గాంధీ వైయస్ వివేకానంద రెడ్డికి ఫోన్ చేశారని సమాచారం. ఆమె ఫోన్ తో వైయస్ వివేకానంద రెడ్డి వెంటనే ఆ మీడియా సమావేశం ఏర్పాటు చేశారని అంటున్నారు. వైయస్ వివేకానంద రెడ్డి తన సోదరుడు వైయస్సార్ ను ప్రశంసిస్తూ ఆయన బాటలోనే కాంగ్రెసు వెంట ఉంటానని చెప్పారు. అంతేకాకుండా, ఇప్పటి వరకు తనకు తన సోదరుడు వైయస్సారే హై కమాండ్ అని, హై కమాండ్ తో తనకు నేరుగా సంబంధాలు లేవని, ఇప్పుడు తనకు నేరుగా హై కమాండ్ తో సంబంధాలు ఏర్పడ్డాయని వైయస్ వివేకానంద రెడ్డి చెప్పడాన్ని బట్టి పరిస్థితి మారడానికి గల కారణమేమిటో అర్థమవుతోంది.