Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టిఎస్ఆర్ వివాదాల పుట్ట

T Subbirami Reddy
కళా బంధువుగా పేరు పొందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి మళ్లీ తెర మీదికి వచ్చారు. ఆయన జీవితమంతా వివాదాలే ఉన్నాయి. అయినా, తన ప్రాబల్యం తగ్గకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ వస్తున్నారు. సైకిల్ కూడా లేని స్థాయి నుంచి కోట్లాది రూపాయల ఆసామిగా ఆయన ఎదిగిన వైనాన్ని పరిశీలిస్తే ప్రతిదీ వివాదాస్పదంగానే కనిపిస్తుంది. తెలుగు లలిత కళాతోరణం పేరును రాజీవ్ గాంధీ లలిత కళాతోరణంగా మార్చిన ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో టిఎస్ఆర్ వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. మరమ్మతులకు పది కోట్ల రూపాయలు ఇవ్వడానికి టి. సుబ్బిరామిరెడ్డి ముందుకు రావడంతో ప్రభుత్వం లలిత కళాతోరణం పేరు మార్చడానికి సిద్ధపడింది. దీనిపై తెలుగుదేశం సహా ఇతర ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఏ ప్రయోజనం ఆశించకుండా సుబ్బిరామిరెడ్డి పది కోట్ల రూపాయలు ఎందుకిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఆశించిన ప్రయోజనం ఏమిటో తెలియదు గానీ వివాదానికి మాత్రం ఆజ్యం పోశారు.

కృష్ణా నదిపై స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ హయాంలో నిర్మించిన నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాలతో టి. సుబ్బిరామిరెడ్డి వెలుగులోకి వచ్చారు. నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మాణం కాంట్రాక్టు తీసుకున్న రామచంద్రారెడ్డి వద్ద ఆయన కోద్ది పాటి జీతంతో పైచిలుకు లేబర్ వ్యవహారాలు చూసే ఉద్యోగిగా చేరారు. టిఎస్ఆర్ ది నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామం. హాస్యనటుడు రమణారెడ్డిది కూడా అదే గ్రామం. తీవ్రమైన పేదరికంతో టిఎస్ఆర్ అలమటించేవారు. రామచంద్రారెడ్డి వద్ద చేరిన తర్వాత రూ. 300 వేతనంతో మేనేజర్ గా పదోన్నతి పొందారు. 1974 నుంచి ఆయన జాతకం మారింది. ఆయన కాంట్రాక్టరుగా రూపాంతరం చెందారు. నాగార్జున సాగర్ కాలువల నిర్మాణానికి చెందిన వివిధ కాంట్రాక్టులను ఆయన పొందారు. ఆ కాలువల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆప్పట్లో ఆరోపణలు వచ్చాయి. గాయత్రీ కన్ స్ట్రక్షన్స్ స్థాపించి కాంట్రాక్టులు చేజిక్కించుకోవడం మొదలు పట్టారు. నాగార్జున సాగర్ కాలువల నిర్మాణాలకు చెందిన సిమెంటును హైదరాబాదుకు తరలించి ఆయన థియేటర్లను నిర్మించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ అక్రమాలపై అప్పట్లో విజిలెన్స్ కమిషనర్ థామస్ ఆయనపై అరెస్టు వారంట్ కూడా జారీ చేశారు. ఆ సమయంలో టిఎస్ఆర్ అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య ఇంట్లో దాక్కున్నాడనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై శాసనసభలో తీవ్ర రభస కూడా జరిగింది.

ఆ తర్వాత విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన కాంట్రాక్టులను కూడా సుబ్బిరామిరెడ్డి దక్కించుకున్నారు. అప్పటికే హైదరాబాదులో పాగా వేసిన ఆయన విశాఖపట్నంలో పాగా వేయడానికి ఆలయాల నిర్మాణానికి విరాళాలు ఇచ్చారు. పెళ్లిళ్లలో జంటలకు తాళిబొట్లు ఉచితంగా ఇచ్చారు. క్రికెట్ కిట్లు పంచిపెట్టారు. ఆ రకంగా ప్రజలను తనకు అనుకూలంగా మలుచుకున్నారు. మెల్లగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కాంగ్రెసు పార్టీని తనకు వేదికగా మార్చుకున్నారు. అయితే, స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎందుకో గాని ఆయనను దూరం పెట్టారు. రెండుసార్లు విశాఖపట్నం నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు దగ్గరయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా నియమితులయ్యారు. టిటిడి చైర్మన్ గా ఆర్జిత సేవా టికెట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణం పది కోట్ల రూపాయలకు చెందింది. అయినా ఆయన బయట పడ్డారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కూడా చేరారు. అయితే, దాసరి నారాయణ రావుతో పాటు టి. సుబ్బిరామిరెడ్డిని మన్మోహన్ సింగ్ మంత్రివర్గం నుంచి తొలగించారు. ఇప్పుడు ఆయన మళ్లీ మంత్రివర్గంలో చేరడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారా అనేది అనుమానంగా ఉంది.

గాయత్రీ ఉపాసన చేసే టి. సుబ్బిరామిరెడ్డి కళా బంధువుగా పలు సంస్థలకు సాయం అందిస్తారని సమాచారం. బాలీవుడ్, టాలీవుడ్ నటులకు బహుమతులు ఇవ్వడం, వారికి సన్మానం చేయడం కూడా ఆనవాయితీగా సాగిస్తూ వచ్చారు. ఆ రకంగా ఆయన తనకు ఏ రూపంలో వ్యతిరేకత రాకుండా చూసుకున్నారని అంటారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+