వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ భయంతోనే రాహుల్ వెనక్కి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం భయంతోనే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు, పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తన ఆంధ్రప్రదేశ్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన శనివారం హైదరాబాదు రావాల్సి ఉంది. అయితే, జగన్ వర్గానికి చెందినవారి నుంచి ఎదురయ్యే గొడవను ఊహించి ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఎన్ఎస్ యుఐ, యువజన కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో వైయస్ జగన్ యువతలో పట్టు సాధించారు. వారంతా వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. వారి నుంచి ఎదురయ్యే సమస్యను పసిగట్టి ఆయన రాష్ట్ర పర్యటనను రద్దు చేసుకున్నట్లు వినికిడి. రాష్ట్రంలోని పరిస్థితిని చక్కదిద్దిన తర్వాతనే రాష్ట్ర పర్యటనకు రావాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ ను ఏ మాత్రం సహించకూడదనే ఉద్దేశంతో ఉన్న రాహుల్ తనంత తానుగా రంగంలోకి దిగి రాష్ట్రంలో పార్టీ పరిస్థితులను చక్కదిద్దే పనిని చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై రాహుల్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. 2014లో కేంద్రంలో మళ్లీ తమ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడాలంటే ఈ రాష్ట్రమే కీలకమని అఖిలభారత కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. 2004, 2009లలో యూపీఏ అధికారంలోకి రావడానికి రాష్ట్రం నుంచి లభించిన మద్దతే కారణం. దేశం మొత్తం మీద ఆ పార్టీ అధికారంలో ఉన్న పెద్దరాష్ట్రం కూడా ఇదే. రాహుల్ ఆసక్తికి ఇదే కారణం.వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రంలో పార్టీని సరైన గాడిలో నిలిపేందుకు అవసరమైన మార్గదర్శకత్వాన్నీ రాహుల్ అందిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2009 ఎన్నికల సమయంలోనే రాహుల్‌ యువజన కోటా గురించి ప్రస్తావించారు. ఆ మేరకు రాష్ట్రంలోనూ కొంతమంది అభ్యర్థులకు టిక్కెట్లు ఇప్పించారు. రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఢిల్లీ వెళ్ళి రాహుల్‌తో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. కొంతమంది తమంత తాముగా ఆయన వద్దకు వెళ్తుంటే మరికొందరిని తనే స్వయంగా పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఒక దశలో రాహుల్‌ వరుసగా కొందరు ఎమ్మెల్యేలను ఢిల్లీకి ఆహ్వానించి రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై మంతనాలు జరిపారు.

కడప ఎంపీ జగన్మోహన్‌రెడ్డి ధిక్కార ధోరణి, భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల తీరు, రాబోయే రోజుల్లో చోటుచేసుకునే పరిణామాలు వంటివాటిపై ఎమ్మెల్యేల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. తన మనసులో మాట చెప్పకుండానే పరిస్థితిని బేరీజు వేసుకున్నారు. రాజకీయంగా కొంత కలకలం రేగడంతో ఎమ్మెల్యేలతో భేటీలు నిలిచిపోయాయి. అయినా రాష్ట్రంలో ఎన్ఎస్ యుఐ, యువజన కాంగ్రెస్‌ వ్యవహారాల్లో రాహుల్‌ ప్రమేయం అధికంగా కనిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో యువజన కాంగ్రెస్‌కు సంబంధించి టాలెంట్‌ హంట్‌ కార్యక్రమం సాగుతోంది. రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడి కార్యక్రమంపై రాహుల్‌ ప్రత్యేకంగా శ్రద్ధవహిస్తున్నారని సమాచారం. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు, విభజన, సమైక్య ఉద్యమాల నేపథ్యంలో ఆయన రాష్ట్ర పర్యటన సరికాదని అధిష్ఠానం భావించినట్లు సమాచారం. రాహుల్‌ కార్యక్రమాలన్నీ చాపకింద నీరులా సాగడమమే ఉత్తమమని అధిష్ఠానం అభిమతంగా పార్టీ వర్గాలు చెబుతున్నారు. దానివల్లనే ఆయన శనివారం నాటి హైదరాబాదు పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X