చిరంజీవి వర్సెస్ వైయస్ జగన్
కాగా, చిరంజీవిని తొలుత వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నిక చేయించి, కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. విలీనం ఒకవేళ తక్షణమే జరగకపోయినా మిత్రపక్షాలుగా ఆ దిశగానే ముందుకు సాగే అవకాశాలున్నాయి. దీంతో కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవిని 2012లో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా చేసి ఎన్నికల బరిలోకి దింపుతారని అంటున్నారు. తెలంగాణలో చిరంజీవి తిరిగే వాతావరణం ఏర్పడితే వైయస్ జగన్కు కూడా ఆ అవకాశం లభిస్తుంది. దీంతో సీమాంధ్రలోనే కాకుండా తెలంగాణలోనూ రాజకీయం చిరంజీవి వర్సెస్ జగన్గా మారుతుందని అంటున్నారు.
సీమాంధ్రలో వైయస్ జగన్ ప్రభావం వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం జురగుతుందని, చిరంజీవి వల్ల తమ క్యాడర్ కదలబోదని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, కాంగ్రెసు, వైయస్ జగన్ మధ్య ఓట్లు చీలి తమకు లాభం చేకూరుతుందని తెలుగుదేశం నాయకులు అనుకుంటున్నారు. అలాంటి నష్టం జరగకుండా చిరంజీవి కాపాడుతారనేది కాంగ్రెసు అధిష్టానం నమ్మకంగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తెలంగాణలో దాదాపుగా రూపుమాసిపోయిందని అనుకుంటున్నారు. నాయకులు తప్ప క్యాడర్ లేదని భావిస్తున్నారు. అందువల్ల తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నుంచి పోటీ ఎదురవుతుందని అంటున్నారు. అయితే, చిరంజీవి ఆపరేషన్ పూర్తయిన తర్వాత తెరాస అధ్యక్షుడు కెసిఆర్తో కాంగ్రెసు అధిష్టానం వ్యవహారం నడుపుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వ్యవహారం ఎలా ఉంటుందని, కెసిఆర్ను తమకు ఎలా అనుకూలంగా మార్చుకుంటుందనేది ఆసక్తికరమైన విషయమే.