జగన్పై కేసులు, చంద్రబాబు ఖుషీ
గత ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ వల్లనే తెలుగుదేశం పార్టీ ఓట్ల శాతాన్ని కోల్పోయి, అధికారానికి రాలేకపోయింది. జయప్రకాష్ నారాయణ లోకసత్తా పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ ఓట్లను చీల్చింది. ఈ స్థితిలో వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా తెలుగుదేశం పార్టీకే ప్రథమ శత్రువుగా మారింది. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధిక్యతలో ఉన్నట్లు సర్వేలో తేలగా, కాంగ్రెసు పార్టీ రెండో స్థానంలో ఉంది. చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి 7 శాతం ఓట్లు మాత్రమే వచ్చే పరిస్థితి ఉందని తేలింది. చంద్రబాబు ఇటు తెలంగాణలోనూ అటు సీమాంధ్రలోనూ మూడో స్థానానికి పడిపోయారు. ఈ స్థితిలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు మాత్రమే రాష్ట్రంలో ఉండాలనే ఆలోచన చంద్రబాబుది.
సిబిఐ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో వైయస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని చంద్రబాబుతో పాటు తెలుగుదేశం నాయకులందరూ గట్టిగానే నమ్ముతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సిబిఐ దర్యాప్తు క్రమంలోనే వైయస్సార్ ప్రభుత్వ హయాంలోని అవకతవకలు, అక్రమాలు వెలుగులోకి వస్తాయని, దానివల్ల కాంగ్రెసు కూడా ప్రజల్లో ప్రతిష్టను కోల్పోతుందని చంద్రబాబు అనుకుంటున్నారని సమాచారం. జైలుకు వెళ్లడం వల్ల జగన్ ప్రతిష్ట పెరగకపోగా తగ్గుతుందని, వైయస్సార్కు ప్రజల్లో ఉన్న ఆదరణ కూడా తగ్గుతుందని చంద్రబాబు అనుకుంటున్నారు. అదే సమయంలో అన్నా హజారే అవినీతి వ్యతిరేక పోరాటం కూడా తనకు కలిసి వచ్చిందని చంద్రబాబు భావిస్తున్నారు. కాంగ్రెసును, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని దెబ్బ తీయడానికి సమయానికి ఆ పోరాటం అంది వచ్చిందని భావించిన చంద్రాబాబు రోడ్ల మీదికి వచ్చారు.