జగన్ అరెస్టుకు సిబిఐ సన్నాహాలు?
ఈ దాడులలో సిబిఐ అధికారులు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాదులోని జగన్ ఇంట్లో మధ్యాహ్నం సిబిఐ సోదాలు పూర్తయ్యాయి. సాక్షి కంపెనీలో సైతం సిబిఐ అధికారులు కీలక డాక్యుమెంట్లు, హార్డు డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం జగన్ ఆస్తులలో అక్రమంగా పెట్టుబడులు ఉన్నట్టు సిబిఐ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీంతో జగన్కు చిక్కులు తప్పేలా లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. జగన్పై పెట్టిన కేసులలో 120(బి) అత్యంత తీవ్రమైనదిగా న్యాయనిపుణులు భావిస్తున్నట్లు సమాచారం. జగన్ ఇంట్లో సోదాలు పూర్తయిన అనంతరం అధికారులు సీజర్ రిపోర్టు తయారు చేసే పనిలో పడ్డారు. మొత్తానికి సిబిఐ దాడుల తర్వాత జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నదని పలువురు భావిస్తున్నారు. వైయస్సార్సీ పార్టీ నాయకులు సైతం జగన్ అరెస్టును కొట్టి పారేయలేక పోతున్నారు.
జగన్ కేసుతో పాటు ఎమ్మార్ అక్రమాల వ్యవహారంలో సంబంధం గల అధికారులపై గురువారం సిబిఐ దాడులు నిర్వహించింది. బిపి ఆచార్యతో పాటు నాటి ఎమ్మార్ అధికారుల ఇళ్లపై సిబిఐ దాడులు నిర్వహించింది. ఎమ్మార్లో అక్రమాల విషయంలో నాటి ఎమ్మార్, ఎపిఐఐసి అధికారులను సిబిఐ అరెస్టు చేసే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి. విజిలెన్సు నివేదికలోని అంశాలు సైతం ఇందుకు కీలకంగా మారనున్నాయి. బిపి ఆచార్య, పార్థసారథి, శ్రీకాంత్ జోషి, విజయ రాఘవన్, శ్రావణ్ గుప్తా తదితర అధికారుల అరెస్టుకు అవసరమైన సాక్ష్యాలు సిబిఐ సేకరించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం నష్ట పోవడానికి కారకులైన అధికారులందరికీ తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. సిబిఐ దాడులలో బిపి ఆచార్య ఇంట్లోనూ పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.