సీనియర్లపై చంద్రబాబు సీరియస్
పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి సీనియర్ నాయకులు విఫలమవుతున్న నేపథ్యంలో ఆయన పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. సొంత పనులకు ప్రాధాన్యం తగ్గించి, పార్టీ కోసం పనిచేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చంద్రబాబు సీనియర్లకు ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారని చెబుతున్నారు. పార్టీలో ఉంటే ఉండండి, పోతే పొండి అని కూడా ఆయన చెబుతున్నారని వార్తలు వచ్చాయి.
పార్టీ మహానాడు నుంచి చంద్రబాబు పూర్తిగా మారిపోయారని, పార్టీని గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకే సీనియర్ల పట్ల కటువుగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. అయితే, చంద్రబాబు మారిపోయారనే వార్తల్లో నిజం లేదని చెప్పవచ్చు. సీనియర్లకు క్లాస్ పీకినట్లు వార్తలు వచ్చిన వెంటనే అది నిజం కాదంటూ పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. ఇలాంటి ప్రకటన వెలువడడం వెనక కూడా పార్టీ సీనియర్ల ఒత్తిడే ఉందని అంటున్నారు. దీన్ని బట్టి చంద్రబాబు ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయని అర్థం చేసుకోవచ్చు.