టిడిపిలో చిరంజీవి చిచ్చు
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావు దేవినేని నెహ్రూను తమ పార్టీలోకి తేవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. దేవినేని నెహ్రూ తెలుగుదేశం పార్టీలోకి వస్తే తమ ప్రాబల్యం తగ్గడం ఖాయమని వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి నాయకులు భావిస్తున్నారు. అంతేకాకుండా, వంశీకి, నెహ్రూకు క్షణం పడదు. వారిద్దరు ప్రత్యర్థులుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో దేవినేని నెహ్రూ తెలుగుదేశం ప్రవేశాన్ని అడ్డుకోవడానికి వారు దేవినేని ఉమా మహేశ్వర రావుపై తీవ్ర విమర్శలు చేస్తూ వంశీ పార్టీ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
చాలా కాలంగా దేవినేని నెహ్రూ తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి వెంట కాంగ్రెసులోకి వచ్చే వంగవీటి రాధాకృష్ణను ఎదుర్కోవడానికి, వంశీని దెబ్బ తీయడానికి తెలుగుదేశం పార్టీని ఎంచుకోవడమే మంచిదనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి, వంగవీటి రాధాకృష్ణ ప్రజారాజ్యం పార్టీని వీడాలని అనుకున్నారు. చిరంజీవి మాట్లాడిన తర్వాత రాధాకృష్ణ తన ప్రయత్నాన్ని విరమించుకుని మౌనంగా ఉండిపోయారు. కాంగ్రెసులో చేరడానికి ఉన్న దేవినేని నెహ్రూ ఆటంకం రాధాకృష్ణకు తీరిపోయింది. ఇదే నెహ్రూకు సమస్యగా మారింది. ఈ పరిస్థితే తెలుగుదేశం కృష్ణా జిల్లా నాయకుల్లో విభేదాలకు, రాజీనామాలకు, పరస్పర సవాళ్లకు దారి తీసినట్లు భావిస్తున్నారు.