కిరణ్ కేబినెట్లో చిరు చేరుతారా?
ప్రజారాజ్యం పార్టీకి చెందిన నలుగురైదుగురు శాసనసభ్యులకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నాయని సమాచారం. చిరంజీవి మంత్రివర్గంలో చేరుతారా, లేదా అనేది అనుమానంగానే ఉంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగానో ఉప ముఖ్యమంత్రిగానో మాత్రమే ఉండాలనేది చిరంజీవి ఉద్దేశమని చెబుతున్నారు. రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఉప ముఖ్యమంత్రి పదవి అదే ప్రాంతం నుంచి గెలిచిన చిరంజీవికి ఇవ్వడం కుదరదని అంటున్నారు. పైగా, ఉప ముఖ్యమంత్రి పదవి తెలంగాణ ప్రాంతానికి కేటాయించాల్సి ఉంటుంది. అందువల్ల చిరంజీవి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు.
పోతే, చిరంజీవికి సోనియా గాంధీ బంపర్ ఆఫర్ ఇస్తారని అంటున్నారు. తమిళనాడు ఎన్నికల ప్రచార బాధ్యతలను చిరంజీవి భుజాన వేసుకుంటున్నట్లు ఇప్పటికే తేలిపోయింది. దక్షిణాది రాష్ట్రాల పార్టీ బాధ్యతలను చిరంజీవికి అప్పగిస్తారని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెసు తరఫున చిరంజీవిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తేవడానికి నిర్ణయించినట్లు ప్రచారం చేస్తున్నారు. ఈలోగా, చిరంజీవి ఏదో ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రి పదవిని చేపట్టవచ్చునని చెబుతున్నారు.