జగన్పై సిఎం డైరెక్ట్ ఫైట్
తాజాగా ముఖ్యమంత్రి తన రచ్చబండ కార్యక్రమాన్ని జగన్ సొంత జిల్లానుండే కాకుండే దివంగత వైఎస్ నియోజకవర్గం పులివెందుల నుండే ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. దీంతో జగన్తో తాడాపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యే సిఎం జగన్పై ఘాటుగా విమర్శలు చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇన్నాళ్లు తాను మాటమాత్రమైన అననప్పటికీ జగన్ మాత్రం తనపైన, ప్రభుత్వంపైన విమర్శలు చేయడాన్ని ఆయన సహించలేక పోయారని సమాచారం. అయితే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ముఖ్యమంత్రి ఢిల్లీ వేదికగా మొదటిసారి జగన్పై ఫైర్ కావడానికి కారణం అధిష్టానమేనని పలువురు భావిస్తున్నారు.
ఇన్నాళ్లనుండి తాను సైలెంటుగా ఉన్నప్పటికీ జగన్ ఆరోపణలు గుప్పించడాన్ని ముఖ్యమంత్రి అధిష్టానానికి విన్నవించినట్టుగా తెలుస్తోంది. జగన్ వ్యాఖ్యలకు ధీటుగా స్పందించకుంటే పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందని విన్నవించినట్లుగా తెలుస్తోంది. దానికి అధిష్టానం పార్టీకి నష్టం కలిగించకుండా జగన్ను ఎదుర్కొవడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొదటిసారి ముఖ్యమంత్రి ఢిల్లీ వేదికగా జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకు పడినట్టుగా తెలుస్తోంది. అధిష్టానం అనుమతి ఇచ్చినందున ఇక ఆయన జగన్ను ఎదుర్కొనడానికి సన్నద్దమయ్యే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. అందులో భాగంగా పులివెందులలో రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తర్వాత ఆయన మరింత విరుచుకు పడే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది.
రాష్ట్రంలో ప్రభుత్వం తన దయాదాక్షిణ్యాలే అని నిత్యం వ్యాఖ్యానిస్తున్న జగన్ వ్యాఖ్యలలో నిజం లేదని ప్రజలలోకి తీసుకు వెళ్లడానికి ముఖ్యమంత్రి సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. అందుకే సిఎం రాజీనామా చేసి పోటీ చేయాలని డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ నుండే అందరూ గెలిచామని చెప్పడం ద్వారా వారిని ఇరుకున పెట్టే యోచనలో సిఎం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా మంత్రులు డిఎల్ రవీంద్రారెడ్డి, శంకరరావు, ఎంపీ వి హనుమంతరావు మాత్రమే జగన్, ఆయన అనుచరవర్గం ఆరోపణలపై స్పందిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి స్పందించడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో కిందిస్థాయి కార్యకర్తలనుండి, ఎమ్మెల్యేలు మంత్రులలో ఆత్మస్థయిర్యం కూడా నింపవచ్చునని కిరణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
జగన్ వర్గం వ్యాఖ్యలకు ఒకరిద్దరు తప్ప ఎవరూ స్పందించకపోతే ప్రజలలోకి తప్పుడు సంకేతాలు చేరే అవకాశం ఉన్నందున, ముఖ్యమంత్రి స్పందిస్తే అందరికీ కాస్త విశ్వాసం వస్తుందనే భావనలో సిఎం ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి వ్యాఖ్యలద్వారా పార్టీలో ఉండేవారెవరో, వెళ్లేవారెవరో తేలిపోతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.