చిరు సిఎం పదవిని మర్చిపోవాల్సిందే
ముఖ్యమంత్రి పదవిని మాత్రం చిరంజీవి మర్చిపోవాల్సిన పరిస్థితే ఉంది. పిసిసి అధ్యక్ష పదవిని బొత్స సత్యనారాయణ చేపట్టిన తర్వాత చిరంజీవికి ఆ అవకాశాలు పూర్తిగానే రూపుమాసిపోయాయి. ఒకే సామాజిక వర్గానికి చెందినవారికి రెండు ఉన్నత పదవులు రాష్ట్రంలో ఇచ్చే అవకాశం ఉండదు. చిరంజీవిని గౌరవప్రదంగా చూస్తూనే తమ పని తాము చేసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉంది. అందుకు అనుగుణంగానే రాష్ట్ర నాయకులు వ్యవహరిస్తారనడంలో సందేహం లేదు.
ఒకవేళ 2014 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ గెలిచినా చిరంజీవి ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశాలు లేవు. ప్రస్తుతం కాంగ్రెసు పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉంది. దీన్ని చక్కదిద్ది పార్టీని గెలుపు బాటలో నడిపిస్తే ఆ ఘనత బొత్స సత్యనారాయణకే దక్కుతుంది. అప్పుడు అనివార్యంగానే బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థి అవుతారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టడం తన లక్ష్యమని బొత్స సత్యనారాయణ బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నప్పుడు కూడా ఆ విషయం చెప్పానని ఆయన అంటున్నారు. ఇంత కచ్చితంగా మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ అవకాశం లభిస్తే ఆ పదవి వదులుకుంటారని అనుకోలేం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చిరంజీవికి ఏ మాత్రం లేదు. ఒకవేళ రాష్ట్ర విభజన జరిగితే చిరంజీవికి సీమాంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి లభిస్తుందా అనేది కూడా అనుమానమే. సీమాంధ్రకే చెందిన బొత్స సత్యనారాయణకే కాంగ్రెసు నుంచి ఆ పదవిని చేపట్టే అవకాశం లభిస్తుంది. సమైక్యాంధ్ర నినాదం పుచ్చుకున్నప్పటికీ చిరంజీవి ముఖ్యమంత్రి పదవికి దూరంగానే ఉండాల్సి వస్తుంది. రాష్ట్ర విభజన జరిగితే, కాంగ్రెసు అధికారం చేపట్టే స్థితి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి దళితుడైన దామోదరం రాజనర్సింహ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి పదవి ఆయనకు ఇందుకు పనికి వస్తుందని చెప్పవచ్చు. తెలంగాణలో మాదిగలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారి ఓట్లకు గాలం వేయడానికే దామోదరం రాజనర్సింహను ఉప ముఖ్యమంత్రిని చేశారనే మాట వినిపిస్తోంది. అయితే, తెలంగాణలో మాలలు కాంగ్రెసుకు దూరమయ్యే అవకాశాలున్నాయి.