జగన్ దెబ్బ అధిష్టానానికి తెలిసొచ్చి....!

రెండ్రోజుల పాటు ఇక్కడే ఉండి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యడితోపాటు పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో ఆయన వేర్వేరుగా సమావేశం కానున్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం బాధ్యతలు కూడా చూస్తూ వచ్చిన ఆజాద్ అక్కడి ఎన్నికలపై దృష్టిపెట్టి ఇన్ని రోజులూ ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకోలేదు. మార్చి 25న ఢిల్లీలో తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలతో విడివిడిగా సమావేశం కావడం తప్ప ఎలాంటి పార్టీ కార్యక్రమాన్నీ చేపట్టలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఆయన ముందు ప్రధానంగా నాలుగు సవాళ్లున్నాయి. అందులో మొదటిది తమ వర్గంలో చాలా మంది ఎమ్మెల్యేలున్నట్లు జగన్ వెంట వెళుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితి ఏమిటి, ఎవరు పార్టీతో ఉంటారు, ఎవరు వ్యతిరేకంగా వెళతారు, అన్న విషయాలపై ఆయన దృష్టి సారించున్నారు. నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉపసభాపతికి సీఎల్పీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇతర ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటన్నది ఆజాద్ చర్చించనున్నట్లు తెలిసింది.
ఆ వివరాలను ఆయన అధిష్ఠానం దృష్టికి తీసుకువెళతారని, అక్కడ చర్చించాక తదుపరి చర్యలుంటాయని సమాచారం. ముఖ్యమంత్రిని క్రియాశీలం చేయడం
వైయస్ మరణానంతరం పార్టీలో ఏర్పడిన నాయకత్వ లోటును పూడ్చడానికి కాంగ్రెసు అధిష్ఠానం బలమైన సామాజికవర్గానికి చెందిన కిరణ్కుమార్రెడ్డిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినా ఆయన పార్టీలో ధైర్యం నింపే చొరవ చూపలేకపోతున్నారన్న విమర్శ ఉంది. పార్టీ నాయకులెవ్వరితో ఆయన కలవలేకపోతున్నారని, ఎవరినీ విశ్వాసంలోకి తీసుకోవడం లేదనే భావన ఎంపీల్లో ఉంది. పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించే అంశాలు తలెత్తినప్పుడు బహిరంగంగా ధైర్యంగా మాట్లాడే చొరవ చూపలేకపోతున్నారని చెబుతున్నారు. కడప ఉప ఎన్నిక సమయంలో ప్రదర్శించిన వైఖరి ఆయనలోని నాయకత్వ లోపాన్ని ఎత్తిచూపిందంటున్నారు.
ఉప ఎన్నికల అనంతరం ఢిల్లీకొచ్చిన డిఎల్ రవీంద్రారెడ్డి అధిష్ఠానం వద్ద ముఖ్యమంతి శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆజాద్ తొలుత ముఖ్యమంత్రి వ్యవహార శైలిలో మార్పు తీసుకురావాల్సి ఉందని ఎంపీలంటున్నారు. ఈ నెల్లోనే పీసీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతున్నందున దానిపై చర్చ జరుగుతుంది. రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన డి.శ్రీనివాస్ ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన కొనసాగుతున్నారు. తన రాజకీయ భవిష్యత్తు ఏమిటో తెలియని గందరగోళంలో ఆయన ఉన్నారని, అలాంటి వ్యక్తి పార్టీని ఏం నడుపుతారని సీనియర్ నాయకుడు ఒకరు ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా తిరిగి పార్టీశ్రేణులను ఉత్సాహపరచాల్సిన పరిస్థితుల్లో ఆయన హైదరాబాద్ వదిలిపెట్టిపోవడం లేదని, కడప ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రితో సహా నాయకులంతా తిరిగినా డీఎస్ మాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదని ఉదహరిస్తున్నారు.
డిఎస్ వ్యవహారశైలి నచ్చని తెలంగాణ ఎంపీలంతా మల్కాజ్గిరి ఎంపీ సర్వేసత్యనారాయణ పేరును ఆ పదవికి ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అంశం కాంగ్రెసుకు ప్రధాన అడ్డంకిగా మారిన ఈ అంశంపై ఏదో ఒకటి త్వరగా తేల్చేయాలని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అధిష్ఠానం మనసులో మాటేంటో కచ్చితంగా చెబితే దానికనుగుణంగా నడుచుకోవడానికి వీలవుతుందని పేర్కొంటున్నారు. సోనియాతో భేటీ ఆజాద్ శనివారం ఉదయం 10-జన్పథ్లో సోనియాగాంధీని కలిసి రాష్ట్ర పర్యటనపై చర్చించారు. హైదరాబాద్ పర్యటనలో కచ్చితంగా తెలంగాణ అంశం తెరమీదికి వచ్చే అవకాశం ఉన్నందున దానిపై ఏం చెప్పాలన్నదానిపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.పార్టీ బలోపేతంలో భాగంగా జిల్లాల అధ్యక్షుల ఎంపిక తదితర అంశాల గురించి క్షేత్రస్థాయి సమాచారాన్ని ఆజాద్ సమీక్షించనున్నారు.












Click it and Unblock the Notifications