తెలంగాణకు దీదీని అడ్డం వేస్తారా?
తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెసు అధిష్టానం తన వైఖరిని చెప్పే అవకాశం ఉంది. యుపిఎ భాగస్వామ్య పక్షాల అభిప్రాయం కావాలని చెప్పవచ్చు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ రాష్ట్రస్థాయి చర్చలు పూర్తయ్యాయని జాతీయ స్థాయిలో సంప్రదింపులు జరపాల్సి ఉందని చెప్పారు. జాతీయ స్థాయి పార్టీల అభిప్రాయ సేకరణ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దీదీ వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం ఉంది. దీన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కాంగ్రెసు అధిష్టానం వెనక్కి నెట్టే అవకాశం ఉంది. తమకు 2014 ఎన్నికల్లో పూర్తి మెజారిటీ వస్తే, భాగస్వామ్య పక్షాల ఒత్తిడి లేకపోతే రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెసు అధిష్టానం స్పష్టం చేసే అవకాశాలున్నాయి.
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పాత్రను మమతా బెనర్జీ పోషించే అవకాశాలున్నాయి. సమస్య నుంచి గట్టెక్కడానికి కాంగ్రెసు అధిష్టానం అది తప్ప మరో మార్గం కనిపించడం లేదని అంటున్నారు. కాంగ్రెసు వైఖరి అనుకూలంగానూ యుపిఎ వైఖరి అస్పష్టంగానూ తెలంగాణపై వెలువడే అవకాశాలున్నాయి. యుపిఎ భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయానికి కృషి చేస్తామని కాంగ్రెసు అధిష్టానం తప్పించుకోవడానికి ప్రయత్నించవచ్చునని అంటున్నారు.