శ్రీశాంత్పై ధోనీ శీతకన్ను?
కాగా, ధోనీ ఆటగాళ్ల పట్ల ప్రదర్శిస్తున్న వ్యవహారశైలి కూడా విమర్శలకు తావిస్తోంది. ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్పై అతను శీతకన్ను వేశాడని అంటున్నారు. నిలకడగా అతను రాణించలేని మాట నిజమే. కానీ, అతనిలో సత్తా ఉందనేది అందరూ గుర్తించిన విషయం. చివరి నిమిషంలో గాయం కారణంగా ప్రవీణ్ కుమార్ తప్పుకోవపడం వల్ల శ్రీశాంత్ జట్టులోకి వచ్చాడు. అసలు శ్రీశాంత్ను జట్టులోకి తీసుకోవడమే ధోనీకి ఇష్టం లేదని అంటారు. జట్టులోకి వచ్చిన తర్వాత ధోనీ తన నాయకత్వ లక్షణాలను విస్మరించి శ్రీశాంత్పై బహిరంగ వ్యాఖ్యలకు దిగారు. బహిరంగంగా అతనిపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి వ్యవహారం వల్ల ఏ ఆటగాడైనా చిన్నబుచ్చుకుంటాడనేది అందరికీ తెలిసిన విషయమే. శ్రీశాంత్ లాంటి మనస్తత్వం గల ఆటగాళ్ల తీరు మరీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే భారత బౌలింగ్ తీరు బాగా లేదు. జహీర్ ఖాన్ ఒక్కడే కాస్తా నిలకడగా రాణిస్తున్నాడు. శ్రీశాంత్ను జహీర్ ఖాన్కు అప్పగించి, అతనిపై కాస్తా ఆదరణను కురిపిస్తే ఆటకే మేలు జరుగుతుందనే విషయం ధోనీ గుర్తించకపోవడం విషాదమే. శ్రీశాంత్ పట్ల వ్యవహారమే భారత జట్టు తీరుకు నిదర్శనమనే మాట వినిపిస్తోంది.
భారత ఫీల్డింగ్ కూడా అంత బాగా లేదు. ఫీల్డింగ్ ఇంకా ఎంతో మెరుగు పడాల్సిన అవసరం ఉంది. కేవలం బ్యాటింగ్ను నమ్ముకుంటే లాభం లేదనే విషయాన్ని ధోనీ గ్రహించాల్సి ఉంటుంది. శ్రీశాంత్పై ధోనీకి నమ్మకం లేదనే విషయంపైనే కాదు, ధోనీ నాయకత్వ నైపుణ్యంపై కూడా అనుమానాలు తలెత్తే అవకాశం ఉంది. ఎన్ని లోపాలున్నా శ్రీశాంత్ మ్యాచ్ విన్నరే అనే విషయాన్ని ధోనీ కావాలనే గుర్తించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.