రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు?

తెలంగాణ సకల జనుల సమ్మె ఇప్పటికే 25 రోజులకు చేరుకుంది. సమ్మెను విరమింపజేయడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వేసిన ఎత్తులేవీ ఫలించడం లేదు. సమ్మె వల్ల తెలంగాణ ప్రజలే ఇబ్బందులు పడుతున్నారని, సమ్మెకు కోదండరామ్, కెసిఆర్ కారణమని ముఖ్యమంత్రి నిందించిన ప్రజలు వినడం లేదు. వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఈ నెల 9, 10, 11 తేదీల్లో మరోసారి తెలంగాణవాదులు రైల్ రోకోకు దిగుతున్నారు. విజయవాడకు, హైదరాబాదుకు మధ్య నడిచే బస్సులను తెలంగాణవాదులు ఆపేడయంతో తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారిపై ఇటీవల తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
తెలంగాణ ఉద్యమకారుల్లోనే కాదు, తెలంగాణ సమ్మె వల్ల ఇబ్బందులు పడుతున్న సీమాంధ్రుల్లోనూ అసహనం పెరుగుతోంది. ఎంతగా అసహనం పెరిగినా, రాజకీయ నాయకుల నుంచి రెచ్చగొట్టే ప్రకటనలు వెలువడిన ఇప్పటి వరకు తెలంగాణ సకల జనుల సమ్మె ప్రశాంతంగానే జరుగుతోంది. కానీ పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం కూడా లేదు. కాంగ్రెసు అధిష్టానం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతోంది. ఈ స్థితిలో రాష్ట్రపతి పాలన విధించి, పరిస్థితులను చక్కదిద్దడం మినహా మరో మార్గం లేదని కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రపతి పాలన విధిస్తారని వస్తున్న వార్తలను గవర్నర్ నరసింహన్ ఖండించలేదు, సమర్థించనూ లేదు. దాన్ని బట్టి రాష్ట్రపతి పాలన విషయంలో కేంద్రంలో ఓ ఆలోచన మాత్రం సాగుతుందని అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications