కె కేశవరావు అవుట్ చిరంజీవి ఇన్?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ తెలంగాణ ప్రాంతా కాంగ్రెసు ప్రజాప్రతినిధులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. విహెచ్, నంది ఎల్లయ్య వంటి రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేయనప్పటికీ టి-కాంగ్రెసును ముందుండి నడిపిస్తున్న కె కేశవరావు మాత్రం రాజీనామా చేశారు. రాజీనామాలు ఆమోదించండి లేదా తెలంగాణ ప్రకటించండి అని వారు అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. తమకు ఆల్టిమేటం జారీ చేస్తున్న టి-కాంగ్రెసు నేతలను అదుపులో పెట్టడానికి అధిష్టానం రాజీనామాలు ఆమోదించే అవకాశం ఉందనే పుకార్లు సైతం న్యూఢిల్లీలో గుప్పుమంటున్నాయి. అయితే అందరి రాజీనామాలు ఆమోదించకుండా ఎవరిదైనా ముఖ్యమైన నేత రాజీనామా ఆమోదించి మిగిలిన వారిని అదుపులో పెట్టవచ్చునని అధిష్టానం భావిస్తున్నదనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. అందులో భాగంగా టి-కాంగ్రెసును నడిపిస్తున్న కేశవరావు రాజీనామాను ఆమోదించాలని ఆయన స్థానంలో చిరంజీవిని రాజ్యసభకు పంపించాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి అధిష్టానం తీరు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న విధంగా మారింది.
ఇక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులను విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ కోసం టి-కాంగ్రెసుకు నాయకత్వం వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు, మంత్రి జానారెడ్డి, పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ప్రాధాన్యతను దెబ్బతీసే విధంగా టి-కాంగ్రెసులో విభేదాలు సృష్టిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకు ఆయన తనకు సన్నిహితంగా ఉండే కొందరు టి-కాంగ్రెసు నేతలతో కలిసి మరికొందరిని రాజీనామాలపై వెనక్కి తగ్గేలా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.