వైయస్ జగనే టార్గెట్

కాంగ్రెసు అధిష్టానం వైయస్ జగన్పై ముప్పేట దాడికి పూనుకుంది. ఆర్థికంగా జగన్ను దెబ్బ తీయడానికి అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. జగన్ సంస్థలపై, జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినవారిపై ఆదాయం పన్ను శాఖ ద్వారా తగిన చర్యలు చేపట్టింది. జగన్ సంస్థలకు, సాక్షి మీడియాలో పెట్టుబడులు పెట్టిన సంస్థలకు ఐటి శాఖ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. త్వరలో సోదాలు కూడా నిర్వహించే అవకాశాలున్నాయి. జగన్ వెంటే వెళ్తున్న శాసనసభ్యులను నయానా భయానా తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇది కొంత మేరకు ఫలితం ఇచ్చినట్లే ఉంది. జగన్ వల్ల జరిగే నష్టాన్ని ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ద్వారా భర్తీ చేసుకోవడానికి కాంగ్రెసు అధిష్టానం ప్రయత్నిస్తోంది. జగన్ చుట్టూ ఉచ్చు బిగించేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్థిక వ్యవహారాలపై కాంగ్రెసు నాయకులు నిత్యం ఆరోపణలు చేయడం ఇందులో భాగమే.
కాగా, తెలుగుదేశం పార్టీ నాయకులు పరిటాల రవి హత్య కేసును వైయస్ జగన్పై దాడికి వాడుకుంటున్నారు. పరిటాల రవి హత్య కేసులో జగన్ నిందితుడని, పరిటాల రవి హత్య కేసులో నిందితులను వరుసగా జగన్ హత్య చేయిస్తున్నారని ఆరోపిస్తోంది. ఏదో మేరకు జగన్పై అనుమానాలు బలపడే ప్రచారానికి తెలుగుదేశం పార్టీ ఒడిగట్టిందని భావించవచ్చు. తిరిగి సిబిఐతో పరిటాల రవి హత్య కేసుపై విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు సిబిఐ డిఐజికి, రాష్ట్ర గవర్నర్ను కోరారు. వైయస్సార్ హత్యా రాజకీయాలపై కూడా తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. దానికి తోడు, జగన్ ఆదాయ వనరులపై తీవ్రంగా దండెత్తుతోంది. జగన్ ఆస్తులపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ప్రతి రోజు వ్యాఖ్యలు చేస్తున్నారు. పరిటాల రవి హత్య కేసులో జగన్పై చర్యలు తీసుకునేలా కాంగ్రెసు ప్రభుత్వంపై దాడికి దిగుతున్నారు. అయితే, కాంగ్రెసు మాత్రం జగన్ హత్యారాజకీయాల గురించి మాట్లాడడం లేదు.
చంద్రబాబు, తెలుగుదేశం ఆరోపణలకు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియా తోడ్పడుతోంది. పరిటాల రవి హత్య కేసులో, సూరి హత్య కేసులో జగన్ పాత్ర ఉందని చెప్పడానికి ఆంధ్రజ్యోతి విరివిగా వార్తాకథనాలను ప్రచురిస్తోంది. జగన్ సాక్షి మీడియాలో పెట్టుబడులపై ఆరోపణలు చేస్తూ రామోజీ రావుకు చెందిన ఈనాడు దినపత్రిక ధ్వజమెత్తుతోంది. ఈ రెండు పత్రికల వార్తాకథనాలను తీసుకుని చంద్రబాబు కుమారుడు లోకేష్ సిఇవోగా ఉన్న స్టూడియోఎన్ తనదైన రీతిలో జగన్పై ధ్వజమెత్తుతూ వార్తాకథనాలను ప్రసారం చేస్తోంది. ఏమైనా, అధికార, ప్రతిపక్ష పార్టీలకు వైయస్ జగన్ టార్గెట్గా మారారు.












Click it and Unblock the Notifications