తెలంగాణ: హాంగ్కాంగ్లాగా హైదరాబాద్
ముస్లింలతో సంప్రదింపులు జరపకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడానికి వీలు కాదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ తమ పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులతో చెప్పారు. హైదరాబాద్ జనాభాలో 35 శాతం మంది ముస్లింలున్నారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న హైదరాబాదు పాత బస్తీ మజ్లీస్కు పెట్టనికోటగా ఉంటోంది. అయితే, మజ్లీస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలం కాకపోవచ్చు గానీ మెజారిటీ ముస్లింలు తెలంగాణను కోరుకుంటున్నారని సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీర్ అలీఖాన్ వంటివారు చెబుతున్నారు. మజ్లీస్ వ్యవహారశైలిని వ్యతిరేకిస్తున్న ముస్లిం మేధావులు, నాయకులు పాతబస్తీలో ఉన్నారు. తెలంగాణలో ముస్లింలు అధికంగా ఉన్నారని, అందువల్ల తెలంగాణ ఏర్పడితే తాము స్వరం పెంచడానికి వీలవుతుందనే ముస్లిం పెద్దలు కూడా ఉన్నారు.
ఎన్నికల్లో మజ్లీస్ విజయం సాధిస్తూ ఉండవచ్చు కానీ జమాతే ఇస్లామీ హిందు వంటి సంస్థలు తెలంగాణ కోసం పాతబస్తీలో ర్యాలీలు నిర్వహించిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు గుర్తు చేస్తున్నారు. హైదరాబాదును తెలంగాణ నుంచి విడదీయడానికి మజ్లీస్ మినహా అన్ని పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయి. తెలంగాణ ఏర్పడితే బిజెపి బలం పెరుగుతుందని, దాని నుంచి ముస్లింలకు ముప్పు ఉంటుందని అసదుద్దీన్ వాదిస్తూ తెలంగాణను వ్యతిరేకిస్తున్నారు.
ఓవైసీ కుటుంబ సభ్యులు పెద్ద యెత్తున విద్య, వైద్య, రియాల్టీ వ్యాపారాల్లో ఉన్నారు. తెలంగాణ ఏర్పడితే తమ హైదరాబాద్ బ్రాండ్ ప్రత్యేకత దెబ్బ తింటుందనేది అసదుద్దీన్ భయమనేవారున్నారు. అయితే, హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగమని, తెలంగాణ నుంచి దాన్ని విడదీయలేమని రాష్ట్ర విభజన అంశం తొలిసారి కేంద్ర ప్రభుత్వ చర్చలో ప్రధానమైన సందర్భంలో అప్పటి కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోపాల్ పిళ్లై అన్నారు. మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ వంటివారితో పాటు ఎన్నాళ్ల క్రితమో హైదరాబాద్ వచ్చి స్థిరపడిన ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వంటివారు హైదరాబాదుకు ప్రత్యేక హోదా కోరుతున్నారు.
హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో భాగం కాకపోతే తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర నాయకుల నుంచి కూడా ఏ విధమైన వ్యతిరేకత రాదనే అభిప్రాయం బలంగానే ఉంది. హైదరాబాదుకు ఎంతో మంది వచ్చి స్థిరపడ్డారు. అయితే, ఆర్థికంగా, పెట్టుబడులపరంగా హైదరాబాద్ ప్రస్తుతం సీమాంధ్ర నేతల నియంత్రణలో ఉంది. ఈ స్థితిలో హైదరాబాదుకు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేక హోదా కల్పిస్తే సమస్య పరిష్కారం కావచ్చునని అంటున్నారు. ఇందుకు హాంగ్కాంగ్ మోడల్ పనికి వస్తుందనే ఆలోచన సాగుతోంది. దాని వల్ల హైదరాబాద్ మొత్తం తెలుగు ప్రజల నియంత్రణలోకి హైదరాబాదు వస్తుంది. ఈ స్థితిలో కేంద్ర పాలితంగా హైదరాబాదును ఉంచాలనే ప్రతిపాదన వెనక్కి తగ్గే అవకాశాలున్నాయి.