తెలంగాణ: చంద్రబాబు బ్రహ్మపదార్థం
ఎవరు తెలంగాణపై మాట్లాడినా అది ఆయా ప్రాంతాల నాయకుల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. యనమల రామకృష్ణుడి అభిప్రాయం ప్రాధాన్యాన్ని ఆయన రకంగా తగ్గించేశారు. కానీ, చంద్రబాబు వైఖరి ఏమిటో తెలియడం లేదు. దాన్ని ఆయన మనసులోనే దాచుకున్నారని అనుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు మనసులోకి తొంగి చూసినట్లు తెలంగాణ ప్రాంత నాయకులు ఆయన అనుకూలమని, సీమాంధ్రులు తమకు అనుకూలమని చెప్పుకుంటూ ఉద్యమాలు సాగిస్తున్నారు. ఇరు ప్రాంతాల నాయకుల మాటలను కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అయితే, బలం మాత్రం చంద్రబాబు సమైక్యాంధ్రకు అనుకూలమనే అభిప్రాయానికి చేకూరుతోంది. దీంతో తెలంగాణ తెలుగుదేశం నాయకులను తెలంగాణ ప్రాంత ప్రజలు ఏ మాత్రం నమ్మడం లేదు.
కాంగ్రెసు నాయకులు మాత్రం చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారు. కేంద్ర హోం మంత్రి చిదంబరం, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ మాత్రం చంద్రబాబు వైపు వేలెత్తి చూపుతున్నారు. కాంగ్రెసు అధిష్టానం ఓ స్పష్టమైన వైఖరిని తీసుకోలేని స్థితిలో చంద్రబాబును తప్పు పట్టేందుకు సిద్ధపడుతోంది. చంద్రబాబు స్పష్టమైన వైఖరి ప్రకటిస్తే తాము తెలంగాణ కోసం తమ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి, తెలంగాణను సాధించే బాధ్యత తమదే అవుతుందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అంటున్నారు. పొన్నం ప్రభాకర్ మాటల్లో కొంత అర్థం ఉన్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా తన వైఖరిని వెల్లడిస్తే కాంగ్రెసు అధిష్టానం పూర్తిగా ఇరకాటంలో పడుతుంది. దానిపై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తిరిగి వైభవాన్ని పొందుతుంది. కానీ, చంద్రబాబు అందుకు సిద్ధంగా లేరు.