వైయస్ జగన్ తెలంగాణ పాచిక

జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులతో పాటు రాజీనామా చేయని ముగ్గురు తెలంగాణ శాసనసభ్యురాళ్లు కొండా సురేఖ, జయసుధ, కుంజా సత్యవతి రాజీనామాలు చేయడానికి సిద్ధపడుతున్నారు. వీరు తెలంగాణ కోసం రాజీనామాలు చేయడానికి సిద్ధపడుతుండడం గమనార్హం. తమ రాజీనామాల ద్వారా కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులపై ఒత్తిడి పెంచాలనే వ్యూహం ఇందులో ఉందని చెబుతున్నారు. రాజ్యాంగ సంక్షోభం ద్వారానే తెలంగాణ వస్తుందని, ఉద్యమాల ద్వారా రాదని కొండా సురేఖ సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ నెల 13వ తేదీన తాను రాజీనామా చేస్తానని ఆమె చెప్పారు. తన రాజీనామాను ఆమోదించేవరకు అ రోజు నుంచి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఛేంబర్ ముందు బైఠాయిస్తానని కూడా ఆమె ప్రకటించారు. దీన్ని బట్టి జగన్ వర్గం ఎత్తుగడ ఏమిటో తెలుస్తోంది.
వైయస్ తెచ్చిన ప్రభుత్వాన్ని వైయస్ జగన్ పడగొట్టబోరని, దానంతటదే పడిపోతుందని మొదటి నుంచీ జగన్ వర్గం నాయకులు అంటూ వస్తున్నారు. తెలంగాణ అంశంపై ప్రభుత్వం పడిపోతుందని గతంలో జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి గతంలో వ్యాఖ్యానించారు. అంటే, తాముగా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదని, తెలంగాణ విషయంలో రాజీనామాల అంశం ముందుకు వచ్చినప్పుడు దాన్ని తమకు అనువుగా మలుచుకుని, తమ వర్గం కూడా రాజీనామాలు చేస్తే ప్రభుత్వం పడిపోతుందని జగన్ భావిస్తూ వస్తున్నారని చెప్పవచ్చు. అయితే, కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు రాజీనామాలకు సిద్ధపడకపోగా, ప్రభుత్వాన్ని కాపాడుకుంటామని అంటున్నారు. దీంతో జగన్ పాచిక పారే సూచనలు కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications