చక్రబంధంలో వైయస్ జగన్?
విచారణకు పిటిషన్ అర్హమైందా, లేదా అని నిర్ధారించకుండానే సిబిఐ ప్రాథమిక విచారణకు ఆదేశించడం సరైంది కాదని జగన్ సుప్రీంకోర్టుకు సమర్పించిన పిటిషన్లో చెప్పింది. చట్టపరమైన లొసుగులు లేకపోతే వైయస్ జగన్ సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సిన అవసరం లేదని, సిబిఐ విచారణలో నిర్దోషిత్వాన్ని నిరూపించకుంటానని జగన్ అనడం లేదు. దీంతో వైయస్ జగన్ వ్యవహారాలపై అనుమానాలు పెరుగుతున్నాయి. వైయస్ జగన్కు చెందిన సంస్థల్లోకి పెట్టుబడులు ఏ విధంగా వచ్చాయనే విషయంపై సిబిఐ ప్రధానంగా విచారణ జరుపుతోంది. మొత్తం 45 సంస్థలకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఇందులో 17 సంస్థలు జగన్కు చెందినవేనని అంటున్నారు. వైయస్ జగన్ సంస్థల్లోకి స్వదేశీ పెట్టుబడులు 3433 కోట్ల రూపాయలు, విదేశీ పెట్టుబడులు 1590 కోట్లు వచ్చినట్లు భావిస్తున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే వైయస్ జగన్ విపరీతంగా సంపాదించారనేది అందరూ ఎరిగిన విషయమే. ఆయన ఆదాయం కూడా అనూహ్యంగా పెరిగిన విషయం ఆయన చెల్లించిన ముందస్తు ఆదాయం పన్ను మొత్తమే తెలియజేస్తోంది. కేవలం ఆరేళ్ల కాలంలో ఓ పారిశ్రామికవేత్తకు అంత పెద్ద మొత్తం సంపాదించే అవకాశం ఉంటుందా అనేది ప్రాథమికమై ప్రశ్న. దేశంలోనే అత్యంత సంపన్నుడైన రాజకీయవేత్తగా ఎదగడానికి కేవలం ఆరేళ్ల కాలం ఎలా సరిపోయిందనేది మరో ప్రశ్న. వైయస్సార్ అధికారాన్ని వాడుకుని వైయస్ జగన్ ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల వైయస్ తీసుకున్న పలు నిర్ణయాలపై నీలినీడలు అలుముకునే పరిస్థితి ఉంది. అయితే, వైయస్సార్ హయాంలో తప్పుడు నిర్ణయాలేవీ జరగలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు గానీ జగన్ గానీ అనడం లేదు. వైయస్సార్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు మంత్రి వర్గ సభ్యులందరికీ వర్తిస్తాయని, వైయస్సార్ను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని వారంటున్నారు. ఈ వాదన కూడా వైయస్ జగన్ ఆస్తులపై, పెట్టుబడుల వ్యవహారంపై అనుమానాలకు తావిస్తోంది. ఏమైనా, వైయస్ జగన్ చక్రబంధంలో ఇరుక్కున్నట్లేననే మాట వినిపిస్తోంది.