వైయస్ బాటలో బాబు: పార్టీకి బాలకృష్ణ, లోకేష్
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే లక్ష్యంతో ఆయన మహా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 2న మొదలుపెట్టి వచ్చే ఏడాది జనవరి 26 వరకు మహా పాదయాత్రను చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,200 కిలోమీటర్ల దూరం ఈ యాత్ర సాగుతుంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను చుట్టి వచ్చేలా మార్గం ఖరారవుతోంది. దీన్ని టీడీపీ ఎన్నికల గుర్తును స్ఫురింపజేస్తూ సైకిల్ యాత్ర చేపట్టాలని కొందరు నేతలు ప్రతిపాదించారు. కానీ ప్రజలతో కలిసిపోవడానికి, ఎక్కడైనా ఆగి మాట్లాడడానికి పాదయాత్ర అయితేనే సౌలభ్యంగా ఉంటుందని చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పటికే తన నిర్ణయాన్ని ఆయన కొందరు పార్టీ నేతలకు వెల్లడించారు.
దాదాపు వంద రోజుల పాటు పాదయాత్ర చేపట్టడానికి నిర్ణయించుకున్న చంద్రబాబు పార్టీ వ్యవహారాలను తన బావమరిది, సినీ హీరో నందమూరి బాలకృష్ణకు అప్పగించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చుని పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతారని అంటున్నారు. దీనివల్ల తామిద్దరు బాధ్యతలు పంచుకున్నట్లు అవుతుందని చంద్రబాబు అంటున్నట్లు సమాచారం.
కాగా, తన కుమారుడు నారా లోకేష్ రాజకీయ రంగ ప్రవేశానికి కూడా బాలకృష్ణను అడ్డం పెట్టాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు సమాచారం. బాలకృష్ణతో పాటు నారా లోకేష్ పార్టీ కార్యాలయంలో కూర్చుని పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడంలో మామగారికి సహాయ సహకారాలు అందిస్తారని అంటున్నారు. వారిద్దరికి పదవులను నిర్ణయించేందుకు కూడా చంద్రబాబు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణను వర్కింగ్ ప్రెసిడెంట్గా, నారా లోకేష్ను ప్రధాన కార్యదర్శిగా చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. మామాఅల్లుళ్లు సమన్వయంతో పనిచేస్తూ పోతే తాను ఒత్తిడికి గురి కాకుండా ప్రజల్లో కలిసి పోవచ్చునని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. హరికృష్ణను కూడా బాలకృష్ణ పార్టీ చట్రంలోకి తెస్తారని అంటున్నారు. ఏమైనా, నందమూరి కుటుంబ సభ్యులను తిరిగి పార్టీ కోసం వాడుకోవడానికి చంద్రబాబు వ్యూహరచన చేసినట్లు భావిస్తున్నారు.