బాబు టార్గెట్ కెసిఆర్, అందుకే లెఫ్ట్ మద్దతు

సిపిఎంతో పాటు సిపిఐ మద్దతు సాధించగలిగితే తెరాస దూకుడుకు కళ్లెం వేయవచ్చునని భావిస్తున్నారు. వామపక్షాలకు నిబద్ధతతో కూడిన బలమైన క్యాడర్ తెలంగాణలో ఉంది. సిపిఐ, సిపిఐ మద్దతు ఇస్తే ఆ పార్టీల కార్యకర్తలు తమ పార్టీ అభ్యర్థుల కోసం నిజాయితీతో పనిచేస్తారనే నమ్మకం చంద్రబాబుకు ఉంది. మిలిటెన్సీ కూడా ఉంటుంది. దీంతో తెరాస కార్యకర్తలను కట్టడి చేయడానికి వీలవుతుందని ఆయన నమ్ముతున్నారు. పైగా, సిపిఐ, సిపిఎం ఓట్లు తమకు వస్తే పరువు దక్కించుకోవచ్చుననేది కూడా ఆయన ఆశ. స్టేషన్ ఘనపూర్ వంటి స్థానాల్లో తమ అభ్యర్థి గెలవడానికి కూడా అవకాశం ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు.
కెసిఆర్ను దెబ్బ తీయడానికి వామపక్షాల మద్దతు చాలా అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా వామపక్షాల నేతలతో చర్చలు చేయిస్తున్నారు. సిపిఎం నాలుగు స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆ నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. అందువల్ల సిపిఎం, తెలుగుదేశం పార్టీల మధ్య ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం లేదనే చెప్పవచ్చు. దీంతో మిగతా మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం సిపిఎంకు లేదు.
ఇకపోతే, సిపిఐ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. దీంతో తెలుగుదేశం పార్టీ మద్దతిస్తే కార్యకర్తలు నాయకత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. తమ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్ చంద్రబాబు నివాసానికి వెళ్లినందుకే కార్యకర్తలు నిలదీశారు. చంద్రబాబుతో కలిసి పనిచేయవద్దని కూడా ఒత్తిడి పెట్టారు. దీంతో సిపిఐ తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే పరిస్థితిలో లేదని అంటున్నారు. ఏమైనా, కెసిఆర్కు కళ్లెం వేయడానికి చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications