జగన్ దూకుడుకు చెక్: చిరు వల్ల పురంధేశ్వరికీ!?
అయితే కాంగ్రెసు ఢిల్లీ పెద్దలు వేసిన పాచిక పారుతుందో లేదో ముందు ముందు తెలుస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ నుండి జగన్ వైపుకు చాలామంది వెళ్లారు. మరికొంతమంది క్యూలో ఉన్నారు. ఇంకోవైపు తెలంగాణ సెంటిమెంట్. ఇవన్నింటీని ధీటుగా ఎదుర్కొనేందుకే అధిష్టానం పదవుల పందేరానికి తెరలేపింది. అయితే ఈ పందేరం ఎంత వరకు తెలంగాణ సెంటిమెంటును అధిగమిస్తుందో, జగన్ వైపు వెళ్లే వారిని అడ్డుకుంటుందో చూడాలి.
హామీ మేరకే అయినప్పటికీ చిరంజీవికి మంత్రి పదవి కట్టబెట్టడం, పురంధేశ్వరికి ప్రమోషన్ ఇవ్వడం వల్ల ఆ రెండు సామాజిక వర్గాలకు కాంగ్రెసు గాలం వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. పురంధేశ్వరి తన సామర్థ్యాన్ని బాగానే నిరూపించుకున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ నుండి అభినందనలు అందుకున్నారు. అదే సమయంలో ఆమెకు ప్రమోషన్.. సామర్థ్యంతో పాటు చిరంజీవికి కేంద్రమంత్రి పదవి కట్టబెట్టడం కూడా ఓ కారణం కావచ్చునని అంటున్నారు.
చిరుకు పదవి ఇచ్చి పురంధేశ్వరిని సహాయమంత్రిగానే ఉంచితే ఆ సామాజిక వర్గం నుండి, అభిమానులతో పాటు టిడిపి నుండి కూడా ఎదురుదాడి తప్పదని అధిష్టానం భావించి ఉంటుందని చెబుతున్నారు. పురందేశ్వరికి ప్రమోషన్ ఇచ్చి, చిరుకు పదవి కట్టబెట్టడం ద్వారా ఇరు వర్గాలను తమ వైపుకు ఆకర్షించవచ్చునని భావించి ఉంటుందంటున్నారు. చిరుకు, పురంధేశ్వరిలకు కేంద్రం ముందు ముందు చాలా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వైయస్ జగన్ను ఎదుర్కోవాలన్నా, టిడిపిని దెబ్బ తీయాలన్నా ఆ ఇద్దరికీ ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెసు వృద్ధిని కోరుకుంటున్న పలువురు అధిష్టానం చెవుల్లో వేసినట్లుగా తెలుస్తోంది. అయితే కేంద్ర కేబినెట్ విస్తరణ దృష్ట్యా రాష్ట్ర కేబినెట్లోనూ భారీ మార్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్కు, చంద్రబాబుకు చెక్ పెట్టే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం విస్తరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కేంద్ర విస్తరణ చూసిన పలువురు రాష్ట్ర మంత్రులలో అప్పుడే ఆందోళన ప్రారంభమైందట. ఎవరికి తొలగిస్తారో, ఎవరిని తీసుకుంటారో అనే గుబులు వారిలో కనిపిస్తోందని చెబుతున్నారు. సిఎం, పిసిసి అధ్యక్షుల్ని కొనసాగించి క్రమశిక్షణ తప్పుతున్న వారిపై వేటు వేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రమంత్రివర్గ విస్తరణలోనూ అది స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసిన వారికి మన్మోహన్ క్యాబినెట్లో చోటు దక్కలేదు.
సిఎ, పిసిసి అధ్యక్షుల్ని మార్చి కొత్త వారికి అవకాశం ఇచ్చే అంశాల్ని కూడా కొట్టి పారేయలేమని అంటున్నారు. పిసిసి అధ్యక్షుడి ఎంపికలో పెద్దగా ఇబ్బందులు లేకపోయనప్పటికీ, ముఖ్యమంత్రి మార్పు విషయంలో అధిష్టానం తర్జన భర్జన పడుతోన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. దీంతో కిరణ్, బొత్సలకు పదవులకు ఢోకా లేక పోవచ్చునని చెబుతున్నారు.